స్వామిజీపై రేప్ కేసు: విచారణ చేస్తున్న సీఐడి
మైసూరు: రామచంద్రాపుర మఠాధిపతి రాఘవేశ్వర భారతీ స్వామిజీపై నమోదు అయిన అత్యాచారం కేసును సీఐడి అధికారులు పలు చోట్ల విచారణ చేస్తున్నారు. మైసూరు చేరుకున్న సీఐడి అధికారులు బీజేపీ నాయకుడి దగ్గర వివరాలు సేకరించారు.
సోమవారం మైసూరు చేరుకున్న సీఐడి అధికారులు బీజేపీ నాయకుడు హెచ్.వీ. రాజీవ్ ఇంటికి చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు. స్వామిజీ మీద కేసు నమోదు చేసిన గాయిని ప్రేమలతా, దివాకర్ శాస్త్రీ దంపతులను మూడు గంటల పాటు అక్కడే విచారణ చేసి వివరాలు నమోదు చేసుకున్నారు.
2012లో మైసూరులో రామ కథ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం నిర్వహణ మొత్తం హెచ్.వీ. రాజీవ్ చూసుకున్నారు. ఆ సందర్బంలో రాఘవేశ్వర భారతీ స్వామిజీ రాజీవ్ ఇంటిలోనే బస చేశారు. అందు వలన సీఐడి అధికారులు రాజీవ్ ను విచారణ చేశారు.
రాఘవేశ్వర భారతీ మాత్రం తమ ఇంటిలో కొన్ని రోజులు బస చేశారని, గాయిని ప్రేమలతా తమ ఇంటిలో లేరని, ఆమె గంగోత్రిలోని వదిన ఇంటిలో బస చేశారని రాజీవ్ సీఐడి అధికారులకు చెప్పారు. అయితే అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చి రాఘవేశ్వర భారతీ స్వామిజీని కలిసి వెళ్లారని రాజీవ్ సీఐడి అధికారులకు చెప్పారు.
ఇదే సందర్బంలో రాఘవేశ్వర భారతీ మీద ఫిర్యాదు చేసిన ప్రేమలతా మాట్లాడుతూ- విచారణ జరుగుతున్న సమయంలో పలుకుబడి ఉన్న వారు ప్రవర్థిస్తున్న తీరు చాల బాధ కలిగించిందని అన్నారు. సాక్ష్యాలు నాశనం చేస్తారని భయంగా ఉందని ఆరోపించారు.
తన మీద రాఘవేశ్వర భారతీ పదేపదే అత్యాచారం చేశాడని ప్రేమలతా ఫిర్యాదు చేశారు. సీఐడి డీఎస్పీ పురుషోత్తమ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం పుత్తూరులో రామ కథ కార్యక్రమం జరిగింది. పుత్తూరులో అధికారులు దర్యాప్తు చేసి వివరాలు సేకరించారు.