నీ కులమేంటి? ఆ లక్షణాలు లేవే!.. మాజీ సీఎం మెడకు కేసుల ఉచ్చు
జార్ఖండ్ లో ఈనెల 29న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. అంతకంటే ముందే ప్రత్యర్థులపై రాజకీయ వేట మొదలైంది. ఏకంగా మాజీ సీఎం రఘుబర్ దాస్ టార్గెట్ గా ప్రభుత్వ యంత్రాంగం ముందుకుకదిలింది. కొద్ది గంటల కిందటే దాస్ పై తీవ్రస్థాయి కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారం టైమ్ లో.. జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్ సోరెన్ కులాన్ని ఉద్దేశించి అనుచిత, అభ్యంతరకర కామెంట్లు చేశారన్నది దాస్ పై ఆరోపణ.
జార్ఖండ్ లో ఓడింది నేనే.. బీజేపీ కాదన్న సీఎం.. సోరెన్కు విషెస్ చెప్పిన ప్రధాని మోదీ
కులాన్ని కించపర్చారు..
జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ఈనెల 19న మిహిజాం పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేశారు. జంతారా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నఅప్పటి సీఎం రఘుబర్ దాస్.. ‘‘అసలు సోరెన్ కుటుంబం కులమేంటి? చట్టాల ప్రకారం వాళ్ల కులాని గిరిజన లక్షణాలు లేవు''అంటూ విమర్శలు చేశారు. సదరు కామెంట్లు తన కులాన్ని కించపర్చేలా ఉన్నాయంటూ హేమంత్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఎస్టీగా పుట్టడమే నేరం అన్నట్లు రఘుబర్ మాట్లాడారు. ఆయన కామెంట్లు నన్ను తీవ్రంగా బాధించాయి''అని సోరెన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులతోపాటు ఎన్నికల సంఘానికి కూడా దాస్ పై ఫిర్యాదు చేశారు.
ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు..
సోరెన్ ఫిర్యాదుపై మిహిజాం డీఎస్పీ అరవింద్ ఉపాధ్యాయ ఆధ్వర్యంలోని టీమ్ ఇన్వెస్టిగేషన్ చేసిందని, రఘుబర్ దాస్ కామెంట్లు అభ్యంతరకంగా ఉన్నాయనడానికి తగిన ఆధారాలున్నాయని జంతారా జిల్లా ఎస్పీ అన్షుమన్ చెప్పారు. మాజీ సీఎంపై ఎస్సీ, ఎస్టీ చట్టాలతోపాటు ఐపీసీలోని 504, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు. కాగా, మాజీ సీఎం కామెంట్లను బీజేపీ గతంలోనే సమర్థించింది. ‘‘కాషాయం ధరించే బీజేపీ లీడర్లు పెండ్లిల్లు చేసుకోరుగానీ రేప్ లు మాత్రం చేస్తారు''అన్న హేమంత్ సోరెన్ కు కౌంటర్ ఇచ్చారేతప్ప, కులాన్ని కించపర్చేలా మాట్లాడలేదని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు.
తొలి గిరిజనేతర సీఎం దాస్
2003లో జార్ఖండ్ ఏర్పడినప్పటి నుంచి ఒక్క రఘుబర్ దాస్ తప్ప సీఎంలుగా పనిచేసినవారంతా గిరిజనులే కావడం గమనార్హం. ఓబీసీ కేటగిరీలోని ‘తెలి' ఆయన సామాజికవర్గం. సంతాల్ తెగకు చెందిన సోరెన్ కుటుంబం షెడ్యూల్డ్ ట్రైబ్స్(ఎస్టీ) జాబితా కిందికి వస్తుంది. గిరిజనులు ఎక్కువగా ఉండే జార్ఖండ్ లో గిరిజనేతరుడైన దాస్ ను 2014లో సీఎంగా ప్రకటించడం ద్వారా బీజేపీ అందర్నీ ఆశ్చర్యపర్చింది.