శభాష్ దీపికా.. ధైర్యంగా ముందుకొచ్చావ్.. జేఎన్యూ విద్యార్థులకు సంఘీభావంపై రఘురాం రాజన్ ప్రశంస
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో విద్యార్థులపై దాడిని నిరసించిన నటి దీపికా పదుకొనెకు అరుదైన ప్రశంస లభించింది. ప్రఖ్యాత ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ శుక్రవారం తన బ్లాగులో దీపికను ఒక్కతీరుగా మెచ్చుకున్నారు. హింసాకాండపై నిరసన తెలపడానికి ముందుకురావడంగానీ, నిరసన తెలిపిన తీరుగానీ అందరినీ ఆకట్టుకున్నాయన్నారు.
నటి దీపికా పడుకొన్ సంచలన వ్యాఖ్యలు.. రోజరోజుకూ దిగజారుతోంది.. అందుకే కొపమొచ్చింది..
ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సంఘటనపై స్పందించడమంటే సాహసంతో సమానమైందని, తనకు, తన ఫ్యామిలీకి వేధింపులు ఎదురవుతాయని తెలిసి కూడా దీపిక ముందడుగు వేయడం గొప్పవిషయమని, స్వేచ్ఛ కోసం కొన్నిసార్లు త్యాగాలు తప్పవన్న ఆదర్శాన్ని ఆమె చూపించారని రఘురాం రాజన్ అన్నారు. వర్సిటీలో పోరాడుతోన్న విద్యార్థులను కూడా ఆయన ప్రశంసించారు.
ప్రశ్నించేవాళ్లను, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసేవాళ్ల గొంతుకల్ని అణిచేసే క్రమంలో వర్సిటీలు వార్ జోన్లలా మారిపోయాయని, స్వలాభం కోసం కొందరు సమాజంలో విభజన తెస్తున్నారంటూ పరోక్షంగా మోదీ సర్కారుపై రాజన్ విమర్శలు చేశారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల టైమ్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన మోదీ, అమిత్ షాలకు ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చిన సందర్భంలో.. ముగ్గురు కమిషనర్లలో ఒకరైన లావాసా తన భిన్నాభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారని, అది కూడా సత్యం కోసం నిలబడటంలాంటిదేనని రఘురాం రాజన్ అన్నారు.