మోడీ అప్పుడే స్పందించి ఉంటే.. ఇలా జరిగుండేది కాదేమో : గోవింద రాజన్
న్యూఢిల్లీ : బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణల నేపథ్యంలో.. ఆర్.బీ.ఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తీవ్ర మనస్థాపానికి గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరోమారు ఆర్.బీ.ఐ గవర్నర్ పదవిని చేపట్టేది లేదని తేల్చి చెబుతున్నారు.
కాగా ఈ వ్యవహారంపై రఘురామ్ రాజన్ తండ్రి, భారత మాజీ బ్యూరోక్రట్ ఆర్. గోవిందరాజన్ స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా దీనిపై స్పందించిన గోవింద రాజన్.. రఘురామ్ రాజన్ పై దుష్ర్పచారం జరుగుతున్నా.. కేంద్రం పట్టించుకోలేదని సరైన సమయంలో కేంద్రం దీనిపై స్పందించి ఉంటే రఘురామ్ రాజన్ మరో దఫా ఆర్ బీ ఐ గవర్నర్ గా కొనసాగేవారని చెప్పారు.
ఓ తండ్రిగా తన కొడుకును వెనుకేసుకు రావడం లేదని చెప్పిన గోవింద రాజన్.. ఇప్పుడీ వ్యవహారం వివాదాస్పదమవుతున్నందు వల్లే తాను కల్పించుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఇదిలా ఉంటే రఘురామ్ రాజన్ దేశభక్తిపై సందేహాలు లేవనెత్తుతూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి బహిరంగంగానే వివాదస్పద వ్యాఖ్యలు చేయడం, రాజన్ ను తక్షణం ఆర్ బీ ఐ గవర్నర్ పదవి నుంచి తప్పించాలంటూ ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లడంతో మొత్తం వ్యవహారంపై రఘురామ్ రాజన్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యారు.
కాగా, దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ కూడా అలసత్వం వహించారనే వాదనలు వినిపిస్తున్నాయి. సుబ్రమణ్య స్వామి, రాజన్ పై ఆరోపణలు చేసినంత కాలం నోరు మెదపని నరేంద్ర మోడీ, అంతా అయిపోయాక మూడు రోజుల క్రితం ఇచ్చిన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రాజన్ పై వచ్చిన విమర్శలను ఖండించారు. అందులోను రాజన్ పేరును ప్రత్యేకంగా ఏమి ప్రస్థావించని మోడీ ఎవరైనా సరే ఆయనపై విమర్శలు చేయడం తగదన్నారు.
ఇదే విషయంపై రఘురామ్ రాజన్ తల్లి, గోవిందరాజన్ భార్య మైథిలి కూడా స్పందించారు. రాజన్ పై జరిగిన దుష్ప్రచారాన్ని తప్పుబట్టిన ఆమె తన కొడుకు దేశభక్తిని శంకించడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాని అసహనం వ్యక్తం చేశారు. భారత్ లోనే పుట్టి, ఇక్కడి ఐఐటీలోనే చదువుకొని, తిరిగి స్వదేశానికే సేవలందిస్తున్న నా కొడుకు దేశభక్తినే శంకిస్తారా.. అంటూ ప్రశ్నించింది.
విషయంపై మైథిలి మరిన్ని వివరాలను వెల్లడిస్తూ.. 'ఈ వ్యవహారంలో నా కుమారుడు ఏమనుకున్నాసరే, నేను మాత్రం నా అభిప్రాయాలను స్పష్టంగా చెబుతాను. నేను మావారి ఉద్యోగం రీత్యా లండన్ లో ఉంటున్నప్పుడు నా కుమారుడు ఇండియాలోనే ఉన్నారు. అవసరం అనుకుంటే లండన్ లోనే చదువుకునే అవకాశం కూడా నా కుమారుడికి ఉంది.'
' 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల సందర్భంలో కూడా రాజన్ ఢిల్లీలోనే ఉండి వీలైనంత మంది సిక్కులకు ఆశ్రయం ఇచ్చారు. ఐఐటీలో విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసిన రాజన్, అది తన బాధ్యతని భావించి ఉండవచ్చు. ఐఐటీ కాలేజ్ సురక్షిత ప్రాంతం కావడం వల్ల కూడా అల్లర్ల నుంచి ఎంతోమంది సిక్కులను రక్షించి ఆశ్రయం కల్పించారు. అలాంటి వ్యక్తిపై నిందలు వేయడం తగదు' అని కూడా ఆమె చెప్పుకొచ్చారు.