కనీస ఆదాయం పథకం అమలు చేయొచ్చు ..కండీషన్స్ అప్లై: రఘురాంరాజన్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం అమలు చేయడం సాధ్యమేనా..? బీజేపీ మాత్రం కాంగ్రెస్ ఇచ్చిన హామీ వర్కౌట్ కాదని చెబుతోంది. కానీ ఇది సాధ్యమే అంటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘరాం రాజన్. అది ఎలా సాధ్యమవుతుందో కూడా ఆయన వివరించారు. ఇంతకీ కనీస ఆదాయ పథకం వర్కవుట్ కాదని చెబుతున్న బీజేపీ మాటలతో రఘురాం రాజన్ ఎందుకు విబేధిస్తున్నారు... ఆయన చెబుతున్న ఫార్ములా ఏమిటి..?
న్యాయ్ పథకం అమలు అసాధ్యం అంటున్న బీజేపీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెరపైకి తీసుకొచ్చిన కనీస ఆదాయ పథకం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. అసలు ఇది అమలు అవుతుందా అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మరికొందరు దేశంలో ఉన్న ఆర్థిక వనరులు ఈ స్కీమ్ అమలయ్యేందుకు సరిపోవనే వాదన వినిపిస్తోంది. అయితే వీరి వాదన తప్పని చెబుతున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురాం రాజన్. తాను రాసిన పుస్తకం ది థర్డ్ పిల్లర్ పుస్తకం విడుదలైన నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రఘురాంరాజన్.
న్యాయ్ పథకం అమలుకు రూ. 3.34 లక్షల కోట్లు అవసరం
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు ఏడాదికి రూ. 72వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా 25 కోట్ల ప్రజలు లబ్ది పొందుతారని కాంగ్రెస్ అంచనా వేసింది. ఈ స్కీముకు న్యూతమ్ ఆయ్ యోజనగా నామకరణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన న్యాయ్ పథకంతో అట్టడుగున ఉన్న పేదలు లబ్ధి పొందుతారని అభిప్రాయపడ్డారు. అయితే ఇందుకు భారత ఆర్థిక వ్యవస్థ సరిపోతుందా అనేదానిపై కాస్త అనుమానం వ్యక్తం చేశారు రఘురాం రాజన్. కాంగ్రెస్ ప్రతిపాదించిన న్యాయ్ పథకానికి రూ.3.6 లక్షల కోట్లు అవసరం అవుతుంది. అయితే ప్రస్తుతం మోడీ సర్కార్ వివిధ సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నది రూ.3.34 లక్షల కోట్లుగా ఉందని 2019 బడ్జెట్లో పేర్కొంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే న్యాయ్ పథకాన్ని అమలు చేస్తూనే పేదలకు ఇస్తున్న ఇతర సంక్షేమ ఫథకాలను కొనసాగిస్తామని చెబుతోంది. అంటే కాంగ్రెస్ ఆ లెక్కన రూ.6.94 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సర్జికల్స్ స్ట్రైక్స్ మేము కూడా చేస్తాం అంటున్న రాహుల్గాంధీ : ఎక్కడ ? ఎప్పుడు ? ఎందుకు?
న్యాయ్ పథకం అమలు చేస్తే విప్లవాత్మకమైన మార్పు వస్తుంది
ఒకవేళ కనీస ఆదాయ పథకం కాంగ్రెస్ అమలు చేయగలిగితే నిజంగా ఒక విప్లపం తీసుకొచ్చినట్లు అవుతుందని రఘురాంరాజన్ అన్నారు. ఇక న్యాయ్ పథకం అమలుకు కింది స్థాయి నుంచి ఒక ప్రణాళిక రూపొందిస్తే ఇది కచ్చితంగా అమలు చేయొచ్చని రఘురాంరాజన్ చెప్పారు. ఇది ఇవ్వడం వల్ల ఆర్థిక పరమైన విషయాలపై ప్రజలు సొంత నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అయితే న్యాయ్ పథకాన్ని ఎలా అమలు చేస్తారనేదే ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఇప్పటికే అమలులో ఉన్న పలు సంక్షేమ పథకాలను కూడా ఇందులో చేరుస్తారా.. లేక ఇది ప్రత్యేకంగా ఇచ్చి ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొస్తారా అనేది చూడాల్సి ఉందన్నారు. ఇక న్యాయ్ పథకాన్ని ఒక ప్రణాళిక పరంగా అమలు చేయగలిగితే నిజంగానే అద్భుతం సృష్టించొచ్చని రఘురాం రాజన్ చెప్పారు.
ఆర్థిక వనరులపై అనుమానం
న్యాయ్ అమలుపై సాధ్యసాధ్యాలు గురించి చెబుతూనే మరోవైపు దీనికి అవసరమైన ఆర్థిక వనరులపై కూడా ఒక్కింత అనుమానం వ్యక్తం చేశారు రఘురాం రాజన్. వచ్చే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందో అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో పథకం పై పథకం ప్రకటిస్తే న్యాయ్ పథకం అమలు చేయడం కష్టతరమే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు రఘురాం రాజన్. ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఈ పథకం అమలు చేయడం కష్టతరమే అవుతుందన్నారు. ఎన్నికల తర్వాత అప్పటి పరిస్థితుల అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అన్నారు రఘురాంరాజన్.