అయోధ్య రామ మందిరానికి రఘురామకృష్ణ రాజు విరాళం.. ఎంత మొత్తం అంటే..
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మందిరం కోసం ఇతోధికంగా ప్రతీ ఒక్కరు సాయం చేస్తున్నారు. తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు విరాళం అందజేశారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ.. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలోనూ ఉంటూ విమర్శల జడివాన కురిపిస్తున్నారు.
రామ మందిర నిర్మాణం కోసం 3 నెలల వేతనాన్ని రఘురామ విరాళం అందజేశారు. అంటే రూ. 3.9 లక్షలు విరాళం ఇచ్చినట్టు ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇవాళ భక్తులతో కలిసి రూ.1,11,111 అందజేశారు. రామ మందిరం నిర్మాణం అనేది శతాబ్దాల కాలం నాటి స్వప్నం అని తెలిపారు. దీనిని నెరవేర్చేందుకు ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత ఇవ్వాలని కోరారు. మందిరం కోసం రూ.100 ఇచ్చినా విరాళమే అవుతోందని చెప్పారు. రూ. లక్ష ఇచ్చినా విరళమేనని.. శక్తి మేరకు సాయం చేయాలని కోరారు.
అయోధ్య భూ వివాదానికి గత ఏడాది తెరపడిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతో.. మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. హిందువులకు మందిరం, ముస్లింలకు మరో చోట 5 ఎకరాల భూమి కేటాయించాలని తీర్పునిచ్చింది. ఆ తర్వాత భూమి పూజ చేశారు. అయితే కరోనా వైరస్ విజృంభించడంతో భూమి పూజ కార్యక్రమం వాయిదాపడింది. ఆగస్ట్ నెలలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా క్రతువు చేశారు.