ప్రత్యూష కేసు: అమ్మాయిల నుంచి రాహుల్ రూ.లక్షలు వసూలు
ముంబై: 'చిన్నారి పెళ్లి కూతురు' ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య అంశంలో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. ప్రత్యూష ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్కు మరో యువతితో నిశ్చితార్థం అయినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రత్యూష అప్ సెట్ అయ్యారని తెలుస్తోంది.
అదే సమయంలో రాహుల్ గురించి మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతను ప్రత్యూషలాగే మరో ఇద్దరు ముగ్గుర్ని మోసం చేశాడని తెలుస్తోంది. ఇతను హీర్ పటేల్, కేష కంభటి అనే యువతుల వద్ద నుంచి కూడా లక్షలాది రూపాయల డబ్బును తీసుకొని, చీట్ చేశాడని వార్తలు వస్తున్నాయి.
రాహుల్ చాలామందిని మోసం చేశాడని హీర్ పటేల్ ఆరోపిస్తున్నారు. అతను ప్లాన్డ్గా యువతులను మోసం చేస్తాడని ఆరోపించింది. అతను చాలా సింపుల్గా ఉంటాడని, ఎవరైనా యువతి పరిచయం కాగానే స్నేహంగా మెలుగుతాడని హీర్ పటేల్ చెప్పారు.
ఆ తర్వాత.. టీవీ లేదా సినిమా ఇండస్ట్రీలోని ఆఫర్లు ఉన్నాయని నమ్మబలుకుతాడని, ఆ తర్వాత ప్రేమిస్తున్నానని అబద్దం చెబుతాడని, ఆ తర్వాత ఆ యువతులను పూర్తిగా లూటీ చేసి పారిపోతాడని ఆమె ఆరోపించారు. ఇందుకు ప్రత్యూష మినహాయింపు కాదన్నారు. తమ వద్ద నుంచి లక్షలాది రూపాయలు దోచుకున్నాడని చెప్పారు.
మంత్రగత్తెనని ఆరోపించాడు: ప్రత్యూష తల్లి
తన కూతురి ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ తన పైన తీవ్రమైన ఆరోపణలు చేశాడని ప్రత్యూష తల్లి సోమా బెనర్జీ చెప్పారు. తాను మంత్రగత్తె ఆరోపించాడని ఆవేదన వ్యక్తం చేశారు. మీ తల్లుదండ్రులు ఏం సంపాదించుకోవడంలేదని, నీ మీదనే ఆధారపడుతున్నారని ప్రత్యూషకు అతను నూరిపోసినట్లుగా కూడా ఆరోపించారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో తల్లిదండ్రులు అక్కడి నుంచి సొంతూరు జంషెడ్ పూర్ వెళ్లిపోయారు. ప్రత్యూష, తల్లిదండ్రుల.. ముగ్గురి పేరిట జాయింట్ అకౌంట్ ఉంటే.. దానిని రాహుల్ రాజ్ బలవంతంగా డీ లింక్ చేశాడని తెలుస్తోంది. ఆ తర్వాత నుంచి ప్రత్యూష డెబిట్ కార్డును అతనే ఉపయోగించేవాడని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, రాహుల్ రాజ్ సింగ్ బెయిల్ను న్యాయస్థానం గురువారం నాడు తోసిపుచ్చింది. ప్రత్యూష తరఫున వాదిస్తున్న లాయర్ మాట్లాడుతూ.. రాహుల్ బెయిల్ను కోర్టు తిరస్కరించిందని, రాహుల్ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని, దీనిపై దర్యాఫ్తు జరుగుతోందన్నారు.