ఆర్ఎస్ఎస్ సూచనల మేరకే కేంద్ర సర్వీసుల్లో పోస్టింగులు: రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోడీపై మరోసారి విమర్శలు గుప్పించారు. కేంద్ర సర్వీసుల్లో ఆర్ఎస్ఎస్ ఇష్టానుసారంగా అధికారులను నియమించుకొనేలా మోడీ సర్కార్ యూపీఎస్సీని నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.
కేంద్రం తీరుతో విద్యార్ధుల భవితవ్యం ప్రమాదంలో పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన లేఖను రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఈ విషయమై విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాహుల్ గాంధీ కోరారు.. అభ్యర్థుల హక్కును కాలరాస్తూ కేంద్ర సర్వీసుల్లోకి ఆర్ఎస్ఎస్కు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేలా ప్రధాని ప్రయత్నిస్తున్నారని రాహుల్ విమర్శలు గుప్పించారు. .
పరీక్ష ర్యాంకులను పక్కనపెట్టి సబ్జెక్టు ప్రాతిపదికన మెరిట్ జాబితాను తారుమారు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. విద్యార్థుల భవితవ్యాన్ని దెబ్బతీసే ఈ ప్రతిపాదన పట్ల గొంతెత్తాలని రాహుల్ పిలుపు ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ తనకు నచ్చిన అధికారులను ఎంచుకునేలా మోదీ వ్యవహరిస్తున్నారని రాహుల్గాందీ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు గుప్పించారు.
సివిల్ సర్వీస్ పరీక్షల ఆధారంగా ప్రస్తుతం అభ్యర్థులకు సర్వీసులను కేటాయిస్తుండగా, తాజాగా పరీక్ష అనంతరం ఫౌండేషన్ కోర్సు ముగిసిన తర్వాత నియామకాలు చేపట్టడాన్ని పరిశీలించాల్సిందిగా ప్రధాని కార్యాలయం (పీఎంఓ) సిబ్బంది శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది.