హాత్రస్కు రాహుల్, ప్రియాంక- ఐదుగురే వెళ్లాలని ఆంక్షలు - తీవ్ర ఒత్తిడితో యోగీ అనుమతి..
ఉత్తర్ప్రదేశ్లోని హాత్రస్లో గ్యాంగ్రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు నిన్న వెళ్లిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక ను యూపీ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తోపులాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో యూపీలోని ఆదిత్యనాథ్ సర్కారు ఇబ్బందుల్లో పడింది.
హాత్రస్ వెళ్లకుండా తమను ఏ శక్తీ ఆపలేదని ఇవాళ మరోసారి ప్రకటించిన కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక ఇవాళ తమ సొంత కారులో డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరారు. అన్న రాహుల్ను పక్కనకూర్చోబెట్టుకుని, తానే డ్రైవ్ చేసుకుంటూ ప్రియాంక వెళ్తున్న విజువల్స్ ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది ఎంపీలను సైతం వెంట తీసుకుని అన్నాచెల్లెళ్లు హాత్రస్ వెళ్లారు. వీరిని అడ్డుకునేందుకు యూపీ ప్రభుత్వంలోని పోలీసు ఉన్నతాధికారులు సైతం హాత్రస్కు పరుగులు పెట్టారు. చివరికి తీవ్ర విమర్శలు, ఉద్రిక్తతల మధ్యే వీరిని హాత్రస్ వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు.
హాత్రస్లో దళిత బాధితురాలిని అగ్రకులాలకు చెందిన కొందరు గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా నాలుక కోయడం, కుటుంబ సభ్యులను బెదిరించి ఇంట్లోనే బంధించడంతో దేశవ్యాప్తంగా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినా యోగీ సర్కారు మాత్రం అధికారుల బదిలీలలో సరిపెట్టింది. ముఖ్యంగా యూపీ పోలీసుల తీరుపై అన్నివర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా హాత్రస్ వెళ్లేందుకు ప్రయత్నించిన రాహుల్ను అడ్డుకోవడంతో ఈ ఆగ్రహం మరింత పెరిగింది. దీంతో చివరికి ఒత్తిడి కొద్దీ కాంగ్రెస్ నేతలను అనుమతించినట్లు తెలుస్తోంది.
Recommended Video