ఎంపీగా రాహుల్, స్మృతి ప్రమాణ స్వీకారం..! 'జై శ్రీరాం' నినాదాలతో హోరెత్తిన పార్లిమెంట్..!!
ఢిల్లీ/హైదరాబాద్ : 17వ లోక్సభ తొలి సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. తొలి రోజున కొత్త ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా.. ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంతకీ అదేంటంటే.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తన చేతిలో ఓటమి పాలైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభలో లేకపోవడం గమనార్హం. తొలి రోజే రాహుల్ సభకు రాకపోవడంతో వచ్చిన పలు సందేహాలకు రాహుల్ ట్విటర్ వేదికగా స్పందించారు. 'లోక్సభ సభ్యుడిగా నాలుగోసారి నా ప్రయాణం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై కేరళలోని వయనాడ్ ఎంపీగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాను. రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం, విధేయతతో ఉన్నాను' అని సమాధానం ఇచ్చారు. ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీ నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేసి స్మృతి ఇరానీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తదనంతరం జరిగిన మంత్రివర్గ కూర్పులో స్మృతి స్థానం సంపాదించారు. కీలక స్త్రీ శిశు సంక్షేమ శాఖతో పాటు జౌళి శాఖ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా, హౌస్ అంతా ట్రజెరీ బెంచీలనుంచి చప్పట్లతో మారుమోగింది.
ఇటీవల లోక్సభ ఎన్నికల్లో రాజకీయ అంశంగా కూడా మారిపోయిన 'జై శ్రీరాం' నినాదాలు పార్లమెంటులో ఎంపీల ప్రమాణస్వీకార సమయంలోనూ సోమవారంనాడు చోటుచేసుకున్నాయి. పశ్చిమబెంగాల్లోని అసోంసాల్ నుంచి ఎంపీగా ఎన్నికైన బాబుల్ సుప్రియో ప్రమాణస్వీకారానికి లేచినప్పుడు అధికార పార్టీ సభ్యులు లోక్సభలో 'జై శ్రీరాం' నినాదాలు హోరెత్తించారు. ఎంపీగా ప్రధాని మోదీ ప్రమాణస్వీకారానంతరం సుప్రియో ప్రమాణస్వీకారం చేశారు.లోక్సభలో 'జై శ్రీరాం' నినాదాలు చేయడంపై బెంగాల్ కూచ్బెహార్ ఎంపీ నితీష్ ప్రమాణిక్ను మీడియా ప్రశ్నించినప్పుడు, భారతదేశంలో వివిధ భాషలు, సంస్కృతులకు చెందిన వారంతా కలిసి జీవనం సాగిస్తున్నారని, జైశ్రీరాం నినాదం బెంగాల్కే పరిమితం కాదని, దేశం మొత్తానికి చెందిన నినాదమని అన్నారు. 'మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకూ జై శ్రీరాం నినాదాలు వింటుంటాం. మంచి జరిగినప్పుడు జై శ్రీరాం అనడం నేరమేమీ కాదు. బెంగాల్లో కొంత మంది మాత్రం ఆ పేరంటే అలెర్జీగా ఫీలమవుతున్నారు' అని ఆయన అన్నారు. జై శ్రీరాం నినాదాలకు కౌంటర్గా మమతా బెనర్జీ 'జై బంగ్లా', 'జై హింద్' నినాదాలు ఇస్తున్నారు కదా అని అడిగినప్పుడు, జై బంగ్లా, జై మహాకాళి, జై మా దుర్గా నినాదాలకు తాము వ్యతిరేకం కాదని అన్నారు. బీజేపీ విజయం సాధించిన తర్వాత బెంగాల్ సీఎం మానసిక పరిస్థితి అంతగా బాగోలేదని ఆయన విమర్శించారు.