కాంగ్రెస్ పార్టీ కొత్త కోశాధికారిగా అహ్మద్ పటేల్ను నియమించిన రాహుల్ గాంధీ
ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కొత్త కోశాధికారిగా సోనియాగాంధీ రాజకీయ సలహాదారుడు ఎంపీ అహ్మద్ పటేల్ను ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అహ్మద్ పటేల్కంటే ముందు ఈ పోస్టును సీనియర్ కాంగ్రెస్ నేత మోతీలాల్ ఓరా నిర్వర్తించారు. ప్రస్తుతం మోతీలాల్ ఓరాను పాలనాశాఖ ఇంఛార్జిగా నియమితులయ్యారు. ఆనంద్ శర్మ పార్టీ విదేశీ వ్యవహారాల బాధ్యతలను నిర్వర్తిస్తారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని నియమించారు. ఇందులో పలువురు సీనియర్లైన దిగ్విజయ్ సింగ్, సుశీల్ కుమార్ షిండే, జనార్దన్ ద్వివేదిలను తప్పించారు. పటేల్ నియామకంతో సీనియర్ నేతలు జూనియర్ నేతల మధ్య సమన్వయం కుదురుతుందని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని రాహుల్ గాంధీ ప్రకటించారు. పార్టీకి సంబంధించి ఏ నిర్ణయమైనా సీడబ్ల్యూసీనే చేస్తుంది.
కొత్తగా ఏర్పాటైన సీడబ్ల్యూసీలో కొంతమంది సీనియర్లకు కూడా చోటు కల్పించారు. ఇందులో ఏకే ఆంటోనీ,అహ్మద్ పటేల్, అంబికా సోనీ, మోతీలాల్ ఓరా, గులాం నబీ ఆజాద్, మల్లికార్జున ఖర్గే, ఆనంద్ శర్మ, కుమారీ శెల్జాలు సభ్యులుగా ఉన్నారు. కొత్త సీడబ్ల్యూసీలో 23 సభ్యులతో పాటు 19 మంది శాస్వత సభ్యులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. ఇక 2019 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాహుల్ కాంగ్రెస్ పార్టీలో సమూల మార్పులు చేస్తున్నారు. ముఖ్యమైన శాఖల్లో సీనియర్లను తొలగించి యువరక్తంతో నింపుతున్నారు. కొన్ని శాఖల్లో మాత్రం సీనియర్ల అనుభవం పనికొస్తుందని భావించి యువకులతో పాటు వారి స్థానాన్ని కదలించలేదు.