రాఫెల్ అంశంలో మోడీపై రాహుల్ నిప్పులు: చౌకీదారే దొంగయ్యాడన్న కాంగ్రెస్ అధ్యక్షుడు
దేశానికి వాచ్మ్యాన్ అని చెప్పుకునే వ్యక్తి దొంగగా దొరికిపోయారని అది మరోసారి రుజువైందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ కొనుగోలు విషయంలో ప్రముఖ ఆంగ్ల దినపత్రిక బయటపెట్టిన విషయాలను ఆయన మీడియా సమావేశంలో వివరించారు. అదే సమయంలో ఆ పత్రిక చేసిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టుపై రాహుల్ అభినందించారు. ఓవైపు ఫ్రాన్స్ ప్రభుత్వంతో రాఫెల్ కొనుగోలుపై చర్చలు జరుపుతుండగానే మరోవైపు ప్రధాని కార్యాలయం అడ్డదారిలో చర్చలు జరిపిందనే విషయాన్ని ఆ పత్రిక వెల్లడించింది. ఇంత పక్కాగా సమాచారం వచ్చాక కూడా కచ్చితంగా రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. అంతేకాదు ఇప్పటికే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎలాంటి అవినీతి జరగలేదని సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో తీర్పు ప్రశ్నార్థకంగా మారిందన్నారు రాహుల్ గాంధీ.
#WATCH: Rahul Gandhi on PM saying 'Ulta Chor, Chowkidaar ko daante': He's talking about himself?He has got a dual personality?He's now viewing himself as 'Chowkidaar & 'Chor'? He talks to himself at night,one day he becomes 'Chowkidaar' & one day he becomes 'Chor'? Schizophrenia? pic.twitter.com/yhb0GSh4HH
— ANI (@ANI) February 8, 2019
అధికారికంగా భారత బృందం ఫ్రాన్స్తో చర్చలు జరుపుతుండగానే ప్రధాని మరొకరితో చర్చలు ఎందుకు జరిపాల్సి వచ్చిందని రాహుల్ ప్రశ్నించారు. ఇది తనకోసమో లేక ప్రజలకోసమో కాదని తన స్నేహితుడు అనిల్ అంబానీ కోసమే ప్రధాని మోడీ చర్చలు జరిపారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దీంతో చౌకీదార్ దొంగగా మారినట్లు స్పష్టంగా అర్థమవుతోందని రాహుల్ విమర్శించారు. ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవడంపై రక్షణశాఖ ఎప్పుడో అడ్డు చెప్పిన విషయాన్ని తను పదేపదే చెబుతూ వచ్చినప్పటికీ ప్రభుత్వం తన ఆవేదనను పెడిచెవిన పెట్టిందని రాహుల్ గాంధీ చెప్పారు.
#WATCH Rahul Gandhi on PM Modi says 'you people are rattled because corruption cases have been brought out: Do I look rattled to you? Please take a good look at the PM and take a good look at me and figure out who looks rattled. pic.twitter.com/grv4qlGeNY
— ANI (@ANI) February 8, 2019
ఇదిలా ఉంటే గురువారం లోక్సభలో రాఫెల్ వివాదంపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందని ప్రధాని మోడీ మండిపడ్డారు. కాంగ్రెస్కు రక్షణ వ్యవస్థ బలోపేతం కావడం ఇష్టం లేనట్లుందని చెప్పిన ప్రధాని అందుకే పదేపదే అబద్ధాలను ప్రచారం చేస్తోందని మోడీ మండిపడ్డారు. కాంగ్రెస్ రాఫెల్పై అంతగట్టిగా ఎలా అబద్దాలు చెప్పగలుగుతోందో తనకు ఇప్పటికీ అర్థంకాలేదని మోడీ చెప్పారు. తర్వాత తనకు అసలు సంగతి బోధపడిందన్నారు. ఇన్నేళ్లు కాంగ్రెస్ పాలనలో ఒక్క రక్షణ ఒప్పందం కూడా సవ్యంగా జరగలేదని ఆరోపించిన ప్రధాని ఎన్డీఏ హయాంలో కూడా జరగకూడదనే కృతనిశ్ఛయంతో కాంగ్రెస్ పనిచేస్తోందని చెప్పారు.