రాహుల్ భయ్యా! మీరు వెకేషన్లో ఉన్నారు: ‘మత్స్యశాఖ’ కామెంట్లపై అమిత్ షా సెటైర్లు
పుదుచ్చేరి: కేంద్రంలో మత్స్యశాఖను ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్ షా చురకలంటించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పుదుచ్చేరిలో పర్యటిస్తున్న ఆయన.. కాంగ్రెస్ పార్టీతోపాటు రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆదివారం కరైకల్ లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
Recommended Video
రాహుల్ లాంటి నాయకుడు మీకు కావాలా?
కొద్ది రోజుల క్రితం పుదుచ్చేరికి వచ్చిన రాహుల్ కేంద్రంలో మత్య్సశాఖ ఎందుకు లేదని ప్రశ్నించారు. కనీసం కేంద్రంలో ఆ శాఖ రెండేళ్ల కందటి నుంచే ఉందని కూడా తెలియని వ్యక్తి మీకు నాయకుడిగా కావాలా? అని నేను అడుగుతున్నా. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలంతా బీజేపీలో చేరుతున్నారు. అంతా అభివృద్ధి వైపే చూస్తున్నారు అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
ప్రధాని తమిళం నేర్చుకోవాలనుకుంటున్నారు
పుదుచ్చేరిలో 75 శాతం నిరుద్యోగ యువత ఉన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువత 40 శాతానికి తగ్గుతుందని అన్నారు. ప్రధాని మోడీకి తమిళ సోదరులు అన్నా.. తమిళ భాష అన్నా.. ఎంతో ఇష్టమని, అందుకే ఆయన ఈరోజు మన్ కీ బాత్లోనూ తమిళం నేర్చుకోలేనందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారన్నారు అమిత్ షా. ప్రధానిగా తమిళం నేర్చుకుని ఇక్కడి సోదరులతో ఆయన మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పారు. మత్స్యకారుల సమస్యలు తీర్చి మౌలిక సౌకర్యాలు మెరుగుపర్చడానికి కేంద్రం బడ్జెట్లో 20వేల కోట్లు కేటాయించింది. ఈ ప్రాంతం అభివృద్ధికి కేంద్రం రూ. 15వేల కోట్లు మంజూరు చేసింది. కానీ, నారాయణస్వామి మాత్రం ఆ నిధుల్ని ఎక్కడ ఖర్చు చేసిందనే విషయాన్ని ప్రజలు నిలదీయాలన్నారు.
మోడీ ప్రభుత్వం ఎంతో కృషి
తాము పుదుచ్చేరిలో అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్న ప్రతి పేద కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీటి కుళాయి సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. పుదుచ్చేరి అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అమిత్ షా తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించే విధంగా ఉడాన్ పథకంలో భాగంగా పుదుచ్చేరి, బెంగళూరు, హైదరాబాద్ను అనుసంధానం చేసిందన్నారు. బీజేపీ ఇక్కడ ఎదుగుతుందని భయంతోనే స్థానిక నాయకులు ఇక్కడ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపడం లేదని ఆరోపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ పుదుచ్చేరిలో పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.