సుప్రీంకోర్టుపై వ్యాఖ్యలకు చింతిస్తున్నాను... రాఫెల్ కేసులో మాత్రం సారీ చెప్పను: రాహుల్
Recommended Video
న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంలో తాను చేసిన వ్యాఖ్యలపై ధిక్కారణ నోటీసులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే ఈ సారి కూడా క్షమాపణ చెప్పేది లేదంటూ స్పష్టం చేశారు. చౌకీదార్ చోర్ హై అనే నినాదం సుప్రీంకోర్టు కూడా చెప్పిందనే వ్యాఖ్యలు గతంలో చేశారు రాహుల్ గాంధీ. దీనిపై బీజేపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు తాజా అఫిడవిట్లో పేర్కొన్న రాహుల్ గాంధీ... రాజకీయ వివాదాల్లోకి కోర్టును లాగాలన్న ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ధిక్కారణ పేరుతో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ.
ఇదిలా ఉంటే రాహుల్ వ్యాఖ్యలతో పాటు రాఫెల్ వివాదంపై దాఖలైన అన్ని రివ్యూ పిటిషన్లను ఏప్రిల్30న విచారణ చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. అయితే రాహుల్ గాంధీ వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇచ్చింది. చౌకిదార్ చోర్ హై నినాదం పేరుతో సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ... ఇప్పటికీ కూడా తాను క్షమించాల్సిందిగా కోరలేదని పేర్కొంటూ అతనిపై ధిక్కారణ కేసును నమోదు చేయాలని కోర్టును కోరారు మీనాక్షి లేఖి తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలపట్ల చింతిస్తున్నట్లు స్పష్టం చేశారని కాంగ్రెస్ నేత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలిపారు. వేడెక్కిన రాజకీయా ప్రసంగాల్లో పొరపాటున సుప్రీంకోర్టుపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని అంతేతప్ప ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కాదని అభిషేక్ సింఘ్వీ వివరించారు. అంతేకాదు రాఫెల్ వివాదంలో ప్రధాని నరేంద్రమోడీకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని అది ఎంతవరకు సబబని సింఘ్వీ ప్రశ్నించారు.