మోడీ కాపలా: పవిత్ర భారత భూమి ఆక్రమించే ధైర్యం చైనాకు ఉందా? రాహుల్ సెటైర్లు..
న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు భారత్లోకి చొచ్చుకుని వచ్చాయని, కొంత భూమిని ఆక్రమించుకున్నాయంటూ వస్తోన్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందంచారు. వాస్తవాధీన రేఖ వెంబడి గల గాల్వన్ వ్యాలీలో కిందటి నెల 15, 16 తేదీల్లో భారత్ చైనా జవాన్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల అనంతరం చైనా.. భారత భూమిని ఆక్రమించుకుందంటూ వచ్చిన వార్తలపై వివరణ ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ డిామండ్ చేశారు.
గాల్వన్ వ్యాలీలో ఏం జరిగిందనే విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నరేంద్రమోడీపై ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఓ ట్వీట్ చేశారు. భారత భూమిని చైనా బలగాలు ఆక్రమించుకున్నాయనే విషయంపై ఓ నేషనల్ మీడియాలో ప్రచురితమైన కథనాన్ని ఆయన తన ట్వీట్కు జత చేశారు. ఆ కథనంలోని అంశాలను ఆధారంగా చేసుకుని నరేంద్ర మోడీపై సెటైర్లను సంధించారాయన. మోడీ వంటి దేశభక్తుడు కాపలా ఉన్న సమయంలో భారత భూమిని ఆక్రమించేంతటి సాహసం చైనా చేయగలుగుతుందా? అని కౌంటర్ ఇచ్చారు.
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే విషయాన్ని ఆ కథనంలో పేర్కొన్నారు. చైనా అంశాన్ని కేంద్రబిందువుగా చేసుకుని రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికే పలుమార్లు విరుచుకుపడ్డారు.. విమర్శలను సంధించారు. అనేక అనుమానాలనూ లేవనెత్తారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. వాస్తవాలేమిటనేది తెలియజేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని అన్నారు. ఆ బాధ్యతల నుంచి ప్రధాని తప్పించుకుంటున్నారని విమర్శించారు.
Recommended Video
సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను దేశ ప్రజలకు వివరించడానికి ప్రధాని ఎందుకు ధైర్యం చేయట్లేదంటూ నిలదీశారు. ఎన్నో రోజుల పాటు వాస్తవాన్ని కప్పిపుచ్చలేరని అన్నారు. శాటిలైట్ ఇమేజ్లు చైనా సైనికులు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. దేశ ప్రజల్లో వ్యక్తమౌతోన్న సందేహాలను తీర్చాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో రాజీపడటం ఏ మాత్రం మంచిది కాదని హితవు పలికారు.