కశ్మీర్లో అడుగుపెట్టిన వెంటనే వెనక్కి అఖిలపక్ష బృందం.. రాహుల్ టీంను ఎందుకు అనుమతించలేదంటే ?
శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన తర్వాత సుందర లోయలో అలజడి నెలకొంది. ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతుండటంతో జనం వీధుల్లోకి రాలేకపోతున్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 40 వేలకు పైగా సీఆర్పీఎఫ్ బలగాలను కశ్మీర్లో మొహరించిన సంగతి తెలిసిందే. దీంతో కశ్మీర్లో పరిస్థితిని పరిశీలించి, అక్కడి ప్రజలను కలిసేందుకు వెళ్లిన అఖిలపక్ష బృందాన్ని కశ్మీర్ పోలీసులు అడ్డుకున్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు కశ్మీర్ వెళ్లారు. గులాం నబీ, కేసీ వేణుగోపాల్, ఆనంద్ శర్మ, టీఎంసీ నుంచి దినేశ్ త్రివేది, డీఎంకే నుంచి తిరుచ్చి శివ, సీపీఎం నుంచి సీతారాం ఏచూరీ, సీపీఐ నుంచి రాజా, లోక్తాంత్రిక్ జనతాదళ్ శరద్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ మనోజ్ ఝా, ఎన్సీపీ నుంచి మజీద్ మెమన్, జనతాదళ్ సెక్యులర్ నుంచి డీ కుపేంద్ర రెడ్డి బృందం కశ్మీర్లో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లింది. అయితే వీరు శ్రీనగర్ చేరుకున్నారు. ఎయిర్పోర్టు నుంచి బయటకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. కశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితి సద్దుమణుగుతుందని ... మీ పర్యటనతో పరిస్థితి చేయి దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. వెనక్కి తిరిగి వెళ్లిపోవాలని సూచించారు.
కశ్మీర్కు ఉన్న స్వయం ప్రతిపత్తిని రద్దుచేసిన తర్వాత కశ్మీర్, లడాఖ్లలో రాజకీయ నేతల పర్యటనపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్భందంలో ఉంచారు. ఈ క్రమంలో అఖిలపక్ష సమావేశం కశ్మీర్ రావడంతో పోలీసులు ముందే అలర్టయ్యారు. వారిని అడ్డుకొని .. తిరిగి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీచేశారు.