ఐఎన్ఎక్స్ మీడియా కేసు: తీహార్ జైలులో రాహుల్, ప్రియాంకా గాంధీ వాద్రా
ముంబై: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో దేశ రాజధానిలోని తీహార్ జైలులో విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి పీ చిదంబరాన్ని బుధవారం ఉదయం రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా కలుసుకున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న చిదంబరం ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం అధికారుల కస్టడీలో కొనసాగుతున్నారు.
ఇదే కేసులో చిదంబరాన్ని సీబీఐ సైతం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 21వ తేదీన ఆయనను సీబీఐ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్ లభించింది. వ్యక్తిగత పూచీకత్తు మీద దేశ అత్యున్నత న్యాయస్థానం చిదంబరానికి కిందటి నెల 22వ తేదీన బెయిల్ ను మంజూరు చేసింది. అయినప్పటికీ.. ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు చుక్కెదురైంది. బెయిల్ ను మంజూరు చేయడానికి ఢిల్లీలోని రోజ్ వ్యాలి ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది.
దీనితో చిదంబరం ప్రస్తుతం తీహార్ జైలులోనే కొనసాగుతున్నారు. ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో- ఈ ఉదయం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా చిదంబరాన్ని కలుసుకున్నారు. ఈడీ కేసులో బెయిల్ ను మంజూరు చేయాలంటూ చిదంబరం తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టు పిటీషన్ ను దాఖలు చేశారు ఈ పిటీషన్ గురువారం రోజ్ వ్యాలి న్యాయస్థానం సమక్షానికి విచారణకు రానుంది.
బెయిల్ పిటీషన్ విచారణకు రావడానికి ఒకరోజు ముందే రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా చిదంబరాన్ని కలుసుకున్నారు. జైలులో ఆయనకు కల్పిస్తోన్న సౌకర్యాల గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే బెయిల్ లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. బెయిల్ లభించేలా న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. సోమవారం నాడు పార్టీ సీనియర్ నేతల మనీష్ తివారి, శశిథూరూర్ కూడా చిదంబరాన్ని కలుసుకున్నారు.