పరువు నష్టం దావాలో భీవాండి కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీ
భీవాండీ: ఎఐసిసి ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం మహారాష్ట్రలోని భివాండి ట్రయల్ కోర్టు ముందు హాజరయ్యారు. పరువు నష్టం కేసులో విచారణ నిమిత్తం ఆయన భివాండి వెళ్లినట్లు రాహుల్ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నిరుడు లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలో గాంధీ హత్య ఆర్ఎస్ఎస్ పనే అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యలపై ఆరెస్సెస్ కార్యకర్త ఒకరు పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు విచారణకు రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరుకానవసరం లేదంటూ సుప్రీం కోర్టు గురువారంనాడే స్పష్టం చేసింది.
కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులను క్రిమినల్ కేసులుగా పరిగణించరాదంటూ సుప్రీం కోర్టులో పిటిష్ వేశారు. దానికి స్పందనగా భివాండి కోర్టు ముందు హాజరు నుంచి మినహాయింపు వచ్చింది. అయితే రాహుల్ మాత్రం కోర్టుకు హాజరయ్యారు.
కేసు విచారణను భీవాండీ కోర్టు సెప్టెంబర్ 30వ తేదీకి వాయిదా వేసింది. మినహాయింపు ఇచ్చినప్పటికీ కోర్టుకు వచ్చారెందుకని మీడియా అడిగితే, కోర్టుకు ఇచ్చిన మాటను తాను నిలబెట్టుకోవాలని అనుకున్నట్లు జవాబిచ్చారు.