మోడీ సర్కారు భారత ఆర్మీ వైపా? చైనాకు మద్దతుగానా?: సరిహద్దు ఉద్రిక్తతపై రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. పార్లమెంటులో రక్షణశాఖ, హోంమంత్రిత్వ శాఖ ప్రకటనల నేపథ్యంలో బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా కేంద్ర సర్కారుపై ఘాటుగా స్పందించారు.
'అసలు ఏం జరుగుతుందో గమనించినట్లయితే.. సరిహద్దులో ఎవరూ ప్రవేశించలేదని ప్రధాని చెబుతారు. ఆ సమయంలోనే పెద్ద మొత్తంలో చైనాతో సంబంధం ఉన్న బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. ఆ తర్వాత దేశ సరిహద్దులను చైనా ఆక్రమించిందని రక్షణ మంత్రి చెబుతారు. ఇప్పుడేమో హోంశాఖ సహాయ మంత్రి ఎలాంటి చొరబాట్లు జరగలేదని అంటారు. మోడీ ప్రభుత్వం భారత ఆర్మీతో ఉందా? లేక చైనాకు మద్దతుగా ఉందా? మోడీజీ ఎంతుకంత భయపడుతున్నారు' అంటూ రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాగా, రాజ్యసభలో బుధవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇస్తూ.. గత ఆరు నెలల కాలంలో భారత్, చైనా సరిహద్దులో ఎలాంటి చొరబాట్లూ చోటు చేసుకోలేదని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్ సహా విపక్షాలు కేంద్రంపై మండిపడ్డాయి. సరిహద్దు ఉద్రిక్తతలను తక్కువచేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తాయి.
Understand the chronology:
— Rahul Gandhi (@RahulGandhi) September 16, 2020
🔹PM said- no one crossed the border
🔹Then, took a huge loan from a China-based bank
🔹Then, Def Min said- China occupied our land
🔹Now, MOS Home says- there’s no infiltration.
Is Modi Govt with Indian Army or with China?
Modi ji, why so scared?
చొరబాట్లే జరగనప్పుడు చైనాతో జరిగిన భేటీల్లో యథాతథ స్థితిని పునరుద్ధరించాలని భారత్.. చైనాను ఎందుకు డిమాండ్ చేసిందని ప్రశ్నించాయి. కాగా, వాస్తవాధీన రేఖ వద్ద యథాతథా స్థితిని మార్చేందుకు చైనా చేస్తున్న కుట్రను భారత్ తీవ్రంగా అడ్డుకుంటోందని, లడఖ్ ప్రాంతంలో కఠిన సవాళ్లను ఎదుర్కొంటోందని మంగళవారం లోక్సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. సరిహద్దులను గుర్తించేందుకు చైనా అంగీకరించడం లేదని అన్నారు.
ఇక గత జూన్లో ప్రధాని మాట్లాడుతూ మన దేశ భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని అన్నారు. చైనాకు సంబంధించిన ఏషియన్ ఇన్ఫ్ట్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి భారత్ 750 మిలియన్ డాలర్ల రుణం తీసుకున్నట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే వీటన్నింటినీ ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ తాజా ట్వీట్లు చేశారు. అయితే, రాహుల్పై బీజేపీ కూడా అదే స్థాయిలో మండిపడుతోంది. చైనాకు మేలు చేసే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.