మోడీ జీ ఎందుకు మౌనం: రాహుల్ కౌంటర్
లక్నో: ఢిల్లీ క్రికెట్ కుంభకోణంలో తప్పు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి కైనా మౌనం వీడాలని సూచించారు.
అవినీతిని సహించమని పదేపదే చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని సూటిగా ప్రశ్నించారు. రెండు రోజుల పాటు అమేథిలో పర్యటించిన రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ బయలుదేరే ముందు లక్నోలో విలేకరులతో మాట్లాడారు.
లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ తాను అవినీతిని సహించబోనని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కుంభకోణాలు వెలుగు చూసినా ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు.
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కుంభకోణాలు తెరమీదకు వచ్చాయి, ఇప్పుడు తాజాగా క్రికెట్ స్కామ్ వెలుగు చూసింది అన్నారు. క్రికెట్ కుంభకోణం వెలుగులోకి తెచ్చిన మీ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ ను సస్పెండ్ చెయ్యడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు.
తాను అవినీతికి పాల్పడనని, అవినీతికి పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పదేపదే చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పుడు కనీసం ఆ విషయంపై నోరు విప్పడం లేదని విమర్శించారు. డీడీసీఏ నిధుల దుర్వినియోగం పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.