అహ్మదాబాదు కోర్టుకు రాహుల్ గాంధీ...ఈ సారి ఎందుకొచ్చారో తెలుసా..?
అహ్మదాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అహ్మదాబాదులోని మెట్రోపాలిటన్ కోర్టుకు హాజరయ్యారు. అహ్మదాబాదులోని డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ బ్యాంకులో అవకతవకలు జరిగాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతనిపై పరువునష్ట దావా కేసును ఆ బ్యాంకు యాజమాన్యంతో పాటు ఛైర్మెన్ అజయ్ పటేల్ వేశారు. అదే విషయాన్ని తెలుపుతూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
"నేను ఈ రోజు అహ్మదాబాదుకు వచ్చాను. నా రాజకీయ శతృవులు ఆర్ఎస్ఎస్ బీజేపీలు నాపై మరో పరువునష్ట దావా కేసు వేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు వారు కల్పిస్తున్న అవకాశాలకు ధన్యవాదాలు చెబుతున్నాను" అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. చివరిగా న్యాయమే గెలుస్తుందని ట్వీట్లో పేర్కొన్నారు. 2016లో పెద్ద నోట్ల రద్దు సమయంలో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకులో రూ.750 కోట్లు మేరా స్కామ్ జరిగిందన్న ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఈ సాయంత్రం కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సామాన్య ప్రజల పక్షాన పోరాడుతున్నందునే రాహుల్ గాంధీపై తప్పుడు కేసులను బీజేపీ బనాయిస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది.బీజేపీ చేసిన తప్పిదాలను రాహుల్ గాంధీ ప్రజల ముందు ఉంచారని, సామాన్య ప్రజలకు అండగా నిలిచారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ప్రజల పక్షాన రాహుల్ గాంధీ పోరాడుతూనే ఉంటారని ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
ఈ నెల ప్రారంభంలో సూరత్ కోర్టు కూడా రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. దొంగలందరి పేర్ల వెనక మోడీ అని ఎందుకుంటుంది అనే వ్యాఖ్యలు చేయడంతో సమస్త్ గుజరాతీ మోద్ మోడీ సమాజ్ అనే సంస్థ రాహుల్ గాంధీపై సూరత్ కోర్టులో పరువునష్ట దావా వేసింది. దీంతో జూలై 16న రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది.