ప్రజాస్వామ్యం దారుణంగా ఖూనీ: రాహుల్ గాంధీ, బలపరీక్షతో గుణపాఠం తప్పదు..
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పార్లమెంట్ను కుదిపేసింది. సోమవారం ఉదయం క్వశ్చన్ అవర్ సందర్భంగా లోక్సభలో వాడివేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాలు సభలో పెద్ద పెట్టున నినాదాలు చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి కాంగ్రెస్ సభ్యులు, ఇతర పార్టీల నేతలు నినాదాలు చేయడంపై ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్లుప్తంగా మాట్లాడిన రాహుల్ గాంధీ మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ దారుణంగా ఖూనీ చేసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా తమ తమ స్థానాల్లోకి వెళ్లాలని పలుమార్లు స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో సభను వాయిదా వేశారు.
ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును మంగళవారానికి రిజర్వు చేయడంపై కాంగ్రెస్ సానుకూలంగా స్పిందించింది. తమ కూటమికి అనుకూలంగా తీర్పు వస్తుందని కాంగ్రెస్ నమ్మకాన్ని వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత కాంగ్రెస్ సభ్యుడు రణ్దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనైతికం అని అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. బలపరీక్ష నిర్వహిస్తే బీజేపీకి ఎమ్మెల్యేలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.
ఇక అజిత్ పవార్ను ఉద్దేశించి కాంగ్రెస్ అశోక్ చవాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకవేళ అజిత్ ఎన్సీపీ క్యాంపుకు తిరిగి వస్తే పార్టీ సంతోషపడుతుందని, ఆయన తన మనసు మార్చుకొని ఎన్సీపీ చెంతకు వస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు.
ఇక ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ గవర్నర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్ కార్యాలయంలో మద్దతు లేఖను సమర్పించారు. ఫడ్నవీస్కు మెజారిటీ లేదని, ఆయన బలపరీక్షలో ఓడిపోవడం ఖాయమని అన్నారు.
కాగా, మహారాష్ట్ర అంశంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వాదనలు వినడం జరిగింది. బీజేపీ తరఫున ముకుల్ రోహత్గీ, కాంగ్రెస్ తరఫున కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఈ అంశంపై తీర్పును మంగళవారం ఉదయం 10.30లకు రిజర్వు చేసింది.