ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలు, సమాధానం చెప్పాలి, బ్లాక్ మనీ!
బెంగళూరు: కర్ణాటక శాస సభ ఎన్నికలు సమీపిస్తున్న సయంలో రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో రెండవసారి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. శనివారం గంట ఆలస్యంగా ప్రత్యేక విమానంలో బెళగావి చేరుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అదే జిల్లాలోని అథణి పట్టణంలో జరిగిన జనాశ్వీర్వాదం బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీకి సూటి ప్రశ్నలు వేశారు.
మోడీ ఉద్యోగాలు ఎక్కడ!
తాము అధికారంలోకి వస్తే 20 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తామని లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగంతో యువకులు నానా తిప్పలు పడుతున్నా ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్ గాంధీ విమర్శించారు.
విదేశాల్లోని బ్లాక్ మనీ
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లోని బ్లాక్ మనీ మొత్తం భారత్ కు తీసుకువచ్చి ప్రతి కుటుంబంలోని ఓ వ్యక్తి పేరుతో ఉన్న బ్యాంకు అకౌంట్ లో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, ఇప్పటి వరకూ ఒక్క రూపాయి ఎవ్వరికీ ఇవ్వలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు.
నీరవ్ మోడీ ఎక్కడ!
పంజాబ్ నేషల్ బ్యాంకు యాజమాన్యానికి రూ. 11 వేల కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ దేశం విడిచిపారిపోయాడని, అతనికి ఆ అవకాశం కల్పించింది ఎవరో చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ నిలదీశారు.
15 నిమిషాలకు తుస్
ప్రధాని మోడీ మీద ఎక్కువగా విమర్శలు చేసే రాహుల్ గాంధీ శనివారం అథణిలో జరిగిన బహిరంగ సభలో ఎక్కువగా బసవణ్ణ తత్వాల గురించి మాట్లాడారు. కేవలం నీరవ్ మోడీ స్కాం గురించి కొత్తగా మాట్లాడిన రాహుల్ గాంధీ మళ్లీ పాతపాటేపాడి 15 నిమిషాల్లో ఆయన ప్రసంగం ముగించారు.