రాష్ట్రపతి ప్రసంగమంటే లెక్కలేదా .. ఫోన్తో రాహుల్ బిజీ బిజీ ...
న్యూఢిల్లీ : 17వ లోక్సభను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సీరియస్గా ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమ్యాల గురించి వివరిస్తున్నారు. అయితే సభకు హాజరైన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ మాత్రం తన పనిలో తాను మునిగిపోయారు. రెండోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యాలు కానీ, ప్రథమ పౌరుడి ప్రసంగాన్ని గానీ లెక్కచేయలేదు రాహుల్ గాంధీ. తన పని తాను చేసుకుపోయారు. రాహుల్ చర్యపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
చిక్కుల్లో రాహుల్ ..
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో .. కాస్త అజాగ్రత్తగా మెలగడం ఆ పార్టీని డిపెన్స్లో పడేసింది. ఓ వైపు సీరియస్గా కోవింద్ ప్రసంగిస్తుంటే ముందవరుసలో ఆశీనులైన రాహుల్ మాత్రం అదేమి పట్టనట్టు వ్యవహరించారు. తన ఫోన్ను తీక్షణంగా వీక్షిస్తూ మీడియోకు చిక్కారు. అధికార, విపక్ష సభ్యులు నిశ్శబ్ధంగా ఉంటే .. విపక్ష పార్టీ అధినేత ఫోన్ను చూడటం విమర్శలకు దారితీసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది.
ఫోన్లో లీనం ..
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గంటపాటు ప్రసంగించారు. అయితే అందులో 24 నిమిషాల పాటు రాహుల్ గాంధీ తన ఫోన్లో లీనమైపోయారు. ఏదో టైప్ చేస్తూ బిజీగా ఉండిపోయారు. అయితే అదే సమయంలో రాహుల్ తల్లి, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ మాత్రం ఏకాగ్రతతో రాష్ట్రపతి ప్రసంగం వినడం గమనార్హం. కానీ రాహుల్ మాత్రం రాష్ట్రపతి చెప్పే ఏ అంశాలను చెవికెక్కించుకోలేదు. అదేకాదు పార్లమంట్ వద్ద ఫొటోలు తీసుకుంటూ .. సోనియాతో మాట్లాడుతూ మరో 20 నిమిషాలు కాలయాపన చేశారు. మొత్తంగా రాష్ట్రపతి ప్రసంగాన్ని ఇసుమంతైనా లెక్కచేయలేదు రాహుల్.
స్పందించని వైనం
సర్జికల్ స్ట్రైక్స్ గురించి రాష్ట్రపతి ప్రసంగిస్తుంటే .. సభ మొత్తం హర్షం వ్యక్తం చేసింది. కానీ రాహుల్ గాంధీ మాత్రం మిన్నకుండిపోయారు. ఈ సమయంలో సోనియా కూడా బల్లచరవడం విశేషం. అంతేకాదు స్పందించాలని సోనియా రాహుల్కు సైగ చేసినా .. పెద్దగా పట్టించుకోలేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల రాహుల్ ఆ పార్టీ నేతలతోనే కలువడం లేదు. అధ్యక్ష పదవీకి రాజీనామా చేస్తానని ప్రకటించినా .. తిరస్కరించడంతో రాహుల్ అలిగారని అర్థమవుతుంది. కానీ సభలో ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్న తలెత్తుతుంది. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం .. కానీ పార్లమెంట్లో ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడి ప్రవర్తన సరికాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.