‘ఐటమ్’ వివాదం: రాహుల్ గాంధీ తీవ్ర స్పందన, క్షమాపణ చెప్పేది లేదన్న కమల్నాథ్
న్యూఢిల్లీ/భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆ రాష్ట్ర మహిళా మంత్రిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఓ మహిళా మంత్రిపై కమల్నాథ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. వయనాడ్లో మీడియాతో మాట్లాడారు.
కమల్ నాథ్ తమ పార్టీకి చెందినవారే అయినప్పటికీ.. ఆయన ఉపయోగించిన భాష తనకు వ్యక్తిగతంగా నచ్చలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎవరు అలాంటి భాష ఉపయోగించినా తాను అంగీకరించనని స్పష్టం చేశారు. కమల్ నాథ్ వ్యాఖ్యలు దురదృష్టకరమని మరోసారి రాహుల్ అన్నారు. ఆ వ్యాఖ్యలు కమల్ నాథ్ వ్యక్తిగతమైనవేనని, పార్టీవి కాదని తెలిపారు.
కాగా, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా, కమల్ నాథ్ స్పందించారు. దాబ్రాలో తాను చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తన అభిప్రాయం చెప్పారని అన్నారు. తాను ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశానో ఇప్పటికే వివరణ ఇచ్చినట్లు తెలిపారు. తాను ఎవర్నీ అవమానించాలని ఆ వ్యాఖ్యలు చేయలేదని, అందుకే తాను ఎవరికీ క్షమాపణలు చెప్పబోనని తేల్చి చెప్పారు. ఒకవేళ ఎవరైనా అవమానకరంగా భావిస్తే.. తాను ఇప్పటికే పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు తెలిపారు.
కమల్ నాథ్ వ్యాఖ్యలపై ఇప్పటికే దుమారం రేగిన విషయం తెలిసిందే. బీజేపీతోపాటు బీఎస్పీ నేతలు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. తనపై కమల్ నాథ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత, మంత్రి ఇమర్తి దేవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు స్థానం కల్పించారంటూ సోనియా గాంధీని ప్రశ్నించారు. వెంటనే అతడ్ని పార్టీ నుంచి తొలగించాలని కోరారు. సోనియా గాంధీ తన కూతురుపై ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
కమల్ నాథ్ వ్యాఖ్యలకు నిరసనగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా, కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సహా పలువురు నేతలు రెండు గంటలపాటు మౌన దీక్ష చేశారు. కాగా, జాతీయ మహిళా కమిషన్ కూడా కమల్ నాథ్ వ్యాఖ్యలపై ఆయనకు నోటీసులు చేస్తామని తెలిపింది.