మన్మోహన్ సింగ్ హయాంలో మూడు సర్జికల్ స్ట్రైక్స్ చేశాం: రాహుల్
నరేంద్ర మోడీ ఒక సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారని... మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ మూడు సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని అయితే ఆర్మీ రహస్యంగా ఉంచాలని కోరడంతోనే నాటి స్ట్రైక్స్ను బహిర్గతం చేయలేదని రాముల్ గాంధీ అన్నారు. ఎన్నికల రాష్ట్రం రాజస్థాన్లోని ఉదయ్పూర్లో రాహుల్ గాంధీ ఓ సమావేశంలో ప్రసంగించారు.
ప్రధాని నరేంద్ర మోడీ సర్జికల్ స్ట్రైక్స్ను రాజకీయంగా వాడుకున్నారని ధ్వజమెత్తారు రాహుల్. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలవదని భావించిన ప్రధాని నరేంద్ర మోడీ మిలటరీ చేసిన ఈ ఆపరేషన్ను రాజకీయంగా లబ్ధి పొందేందుకు వినియోగించుకున్నారని రాహుల్ విమర్శించారు. యూపీఏ హయాంలో కూడా మూడు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని అయితే ఎప్పుడూ వాటి గురించి బహిర్గతం చేయలేదని గుర్తు చేశారు రాహుల్ గాంధీ.
ఇదిలా ఉంటే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయాధ్యక్షుడు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ వీరమరణం పొందిన జవాన్లను అవమానిస్తున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ మన దేశ సైనికులను మట్టబెడితే అందుకు ప్రధాని సర్జికల్ స్ట్రైక్స్ చేసి ప్రతీకారం తీర్చుకున్నారని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఎలా గెలిచామో ప్రజలకు తెలుసని రాహుల్ గాంధీ చెప్పాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు అమిత్ షా. అంతేకాదు ప్రభుత్వం తమ వెన్నంటే ఉన్నందుకు భారత ఆర్మీ ఎంతో గర్వంగా భావిస్తోందన్నారు.
ప్రధాని మోడీ ప్రపంచ మేధావి అని ఫీల్ అవుతుంటారని అన్నీ తనకే తెలుసని చెప్పే అజ్ఞాని మోడీ అని రాహుల్ విమర్శించారు. యూపీఏ హయాంలో నాన్ ఫెర్ఫార్మింగ్ అసెట్స్ 2 లక్షల కోట్లు ఉండగా... అదే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ హయాంలో పది రెట్లు పెరిగి 12 లక్షల కోట్లుగా ఉన్నాయని ధ్వజమెత్తారు. బడా పారిశ్రామికవేత్తల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని రాహుల్ ధ్వజమెత్తారు. జీఎస్టీ, డీమోనిటైజేషన్ అనేవి పెద్ద కుంభకోణాలుగా రాహుల్ అభివర్ణించారు. అవి బడాబాబుల కంపెనీలకు స్వర్గధామంగా మారాయని అదే సమయంలో సామాన్యుడి వెన్నును విరిచేశాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందన్నారు.