రైతు ఆందోళనలపై రాహుల్ కీలక వ్యాఖ్యలు... చంపారన్ ఉద్యమంతో పోల్చిన నేత...
గత 37 రోజులుగా ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని బ్రిటీష్ కాలం నాటి చంపారన్ ఉద్యమంతో పోల్చారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల రద్దుకు ఉద్యమిస్తున్న ప్రతీ రైతును ఆయన సత్యాగ్రహిగా పేర్కొన్నారు. రైతులు వారి హక్కులను తిరిగి సాధించుకుంటారని చెప్పారు. ఈ మేరకు ఆదివారం(జనవరి 3) రాహుల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
'ప్రస్తుతం దేశంలో చంపారన్ లాంటి ఒక విషాదం నెలకొంది. ఆనాడు బ్రిటీషర్ల కంపెనీ బహదూర్ ఉండేది. ఇప్పుడు మోదీ-ఆయన స్నేహితుల కంపెనీ బహదూర్ ఉంది.' అని రాహుల్ తన ట్విట్టర్ ద్వారా కేంద్రాన్ని విమర్శించారు.
బ్రిటీష్ వలస పాలన కాలంలో 1917లో భారత్లో మహాత్మా గాంధీ సారథ్యంలో చంపారన్ సత్యాగ్రహ ఉద్యమం జరిగింది. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో దీన్ని చారిత్రక ఘటనగా చెబుతారు. అప్పట్లో బ్రిటీషర్లు రైతులతో బలవంతంగా ఇండిగో పంటను వేయించారు. పైగా అందుకు అరకొరా చెల్లింపులు మాత్రమే ఇచ్చారు. దీంతో బిహార్లోని చంపారన్లో రైతులు బ్రిటీషర్లపై తిరగబడ్డారు. అలా బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంపారన్ ఉద్యమం నడిచింది.ఇప్పుడు రైతులు చేస్తున్న ఉద్యమం కూడా అప్పటి చంపారన్ ఉద్యమాన్ని తలపిస్తోందని రాహుల్ వ్యాఖ్యానించారు.
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతుల బతుకులు కార్పోరేట్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడే దుస్థితి తలెత్తుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీస మద్దతు ధరకు గ్యారెంటీ లేకపోవడం,కార్పోరేట్లు క్రమంగా వ్యవసాయాన్ని ఆక్రమించుకునే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ చట్టాలతో రైతుల జీవితాలు మరింత మెరుగుపడుతాయని... పంట ఉత్పత్తులకు మంచి రేటు లభిస్తుందని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే పలు దఫాలుగా రైతులతో కేంద్రం చర్చలు జరపగా అవేవీ సఫలం కాలేదు. దీంతో జనవరి 4న రైతులతో కేంద్రం మరోసారి చర్చలు జరపబోతుంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న ఏకైక ఎజెండాతో రైతులు చర్చలకు హాజరవుతూ వస్తున్నారు. రేపటి సమావేశంలోనూ ఇదే డిమాండును కేంద్రం ముందు పెట్టనున్నారు.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం(జనవరి 2) మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేంద్రం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 75 ఏళ్ల కాశ్మీర్ సింగ్ అనే వృద్ద రైతు ఢిల్లీ సరిహద్దులోని ఘజియాబాద్ నిరసన ప్రదేశం వద్ద బలవన్మరణానికి పాల్పడ్డాడు.దీంతో నిరసన ప్రదేశంలోనే ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల సంఖ్య మూడుకి చేరింది.