అమేథీతో పాటు రాహుల్ ఈ నియోజకవర్గం నుంచి కూడా పోటీచేస్తారు: కాంగ్రెస్
కేరళ: దేశంలో ఎన్నికల వాతావరణం హీట్ పెంచుతోంది. ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో ఉన్నాయి ఆయా పార్టీలు. ఇక వారణాసి నుంచి ప్రధాని మోడీ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారని అందరికీ తెలిసిందే. అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అమేథీ నుంచి బరిలో దిగుతున్నారని కూడా తెలిసిందే. అయితే కేరళ కాంగ్రెస్ ఛీఫ్ మాత్రం మరో బాంబు పేల్చారు. రాహుల్ గాంధీ కేరళ నుంచి కూడా పోటీ చేస్తారని తెలిపారు.
కేరళ నుంచి బరిలోకి రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ.... కాంగ్రెస్ అధ్యక్షుడు. యూపీఏ నుంచి ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. ఇక ఉత్తర్ప్రదేశ్లో నెహ్రూ గాంధీ కుటుంబాలకు కంచుకోటగా ఉన్న అమేథీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారని ఇప్పటివరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా రాహుల్ గాంధీ కేరళ నుంచి బరిలోకి దిగుతారని స్వయంగా ఆరాష్ట్ర కాంగ్రెస్ ఛీఫ్ ముల్లపల్లి రామచంద్రన్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రామచంద్రన్ ప్రకటన వెనక వ్యూహం ఏమై ఉండొచ్చనే చర్చ జోరుగా సాగుతోంది.
వాయనాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ పార్లమెంటరీ స్థానం నుంచి బరిలోకి దిగనున్నట్లు రామచంద్రన్ ప్రకటించారు. వాయనాడ్ ప్రాంతం కర్నాటక కేరళ రాష్ట్రాలకు సరిహద్దు చేస్తుంది. గత నెలరోజులుగా రాహుల్ గాంధీని వాయనాడు నుంచి పోటీకి దింపడంపై సమాలోచనలు చేస్తున్నామని అయితే ముందుగా కాంగ్రెస్ అధ్యక్షుడు పోటీ చేసేందుకు ఒప్పుకోలేదన్నారు రామచంద్రన్. అయితే రాహుల్ గాంధీని కన్విన్స్ చేసేందుకు చాలా సమయం పట్టిందని ... చివరకు వాయనాడ్ నుంచి పోటీచేసేందుకు ఒప్పుకున్నారని రామచంద్రన్ వివరించారు. ఇక గతకొన్నిరోజులు రాహుల్ గాంధీని దక్షిణ భారత రాష్ట్రం నుంచి పోటీలో పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోందని చెప్పిన రామచంద్రన్.... ఇందుకోసం కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు.
రాహుల్ పై మరోసారి స్మృతీ అస్త్రం... అసలు కథ ఏంటంటే...?
దక్షిణ భారతం నుంచి పలు స్థానాలను పరిశీలించిన రాహుల్
ఒకవేళ దక్షిణ భారతం నుంచి పోటీ చేయాల్సి వస్తే రాహుల్ గాంధీ కర్నాటకలోని బెంగళూరు సెంట్రల్, బీదర్, మైసూరు లోక్సభ స్థానాల నుంచి కానీ, తమిళనాడులో కన్యాకుమారి లేదా శివగంగా పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి కానీ, కేరళలో వాయనాడ్ నుంచి కానీ పోటీ చేయాలని ఆసక్తి చూపగా .... చివరకు వాయనాడ్ వైపే మొగ్గు చూపారని రామచంద్రన్ చెప్పారు. ఇక ఇప్పటికే వాయనాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్దిఖ్ ఉన్నారు. అయితే రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేయాలని భావించడంతో అతను స్వచ్చందంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
గతంలో ఇందిరా, సోనియాలు కూడా దక్షిణ రాష్ట్రం నుంచి పోటీ
రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తే అక్కడి పార్టీ క్యాడర్లో జోష్ నింపడంతో పాటు సరిహద్దుగా ఉండటంతో కర్నాటకలో కూడా ఆ ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక తమిళనాడు నుంచి పోటీ చేస్తే బాగుంటుందని భావించిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఛీఫ్ కేఎస్ అళగిరి.... రాహుల్ దక్షిణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారంటే ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి ఒక వారధిలా ఉంటారని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీలు కూడా దక్షిణ భారతం నుంచి పోటీ చేశారు. అయితే ఇద్దరూ కర్నాటక నుంచే పోటీ చేయడం జరిగింది. 1978లో ఇందిరా గాంధీ చిక్మంగళూరు నుంచి పోటీ చేసి గెలవగా... 1999లో సోనియాగాంధీ బళ్లారి నుంచి పోటీచేశారు. బళ్లారిలో ఆమె సుష్మా స్వరాజ్ పై పోటీచేసి గెలుపొందారు.