ట్రంప్ సర్కార్ స్లోగన్పై మోడీని బాగా కవర్ చేశారు: జైశంకర్ పై రాహుల్ కౌంటర్
న్యూఢిల్లీ: మోడీ చేసిన ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ప్రధాని మోడీ హూస్టన్లో చేయలేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ట్రంప్ చెబితేనే మోడీ ఈ స్లోగన్ గురించి ప్రస్తావించారంటూ జైశంకర్ చెప్పారు. జైశంకర్ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు.
ప్రధాని మోడీ అసమర్థతను చాలా చక్కగా కవర్ చేశారని జైశంకర్ను ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. హూస్టన్లో ప్రధాని నరేంద్ర మోడీ ఆబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అన్న నినాదంను లేవనెత్తడంతో ట్రంప్ అధ్యక్ష ఎన్నికల కోసం మోడీ ప్రచారం చేశారంటూ కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్. దౌత్యపరమైన అంశాలపై ఎలాగూ జైశంకర్కు అనుభవం ఉంది కాబట్టి మోడీకి ఆ పాఠాలు నేర్పాలని రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా చెప్పారు.
Thank you Mr Jaishankar for covering up our PM’s incompetence. His fawning endorsement caused serious problems with the Democrats for India. I hope it gets ironed out with your intervention. While you’re at it, do teach him a little bit about diplomacy.https://t.co/LfHIQGT4Ds
— Rahul Gandhi (@RahulGandhi) October 1, 2019
అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని మోడీ చేసిన స్లోగన్పై వివరణ ఇచ్చారు జైశంకర్. విదేశీ రాజకీయాల్లో భారత్ జోక్యం ఉండదని స్పష్టం చేశారు జైశంకర్. అమెరికాలో ఏది జరిగినా అది వారి రాజకీయమే తప్ప మన రాజకీయం ఉండదని వెల్లడించారు. తనకు గుర్తున్నంత వరకు గతంలో ట్రంప్ ఆబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదంను వాడారని అదే ప్రధాని తిరిగి హూస్టన్ సభలో చెప్పారని జైశంకర్ వెల్లడించారు. అంటే ఇక్కడ ప్రధాని మోడీ గతం గురించి మాత్రమే ప్రస్తావించారన్నది గ్రహించాలని జైశంకర్ వెల్లడించారు. ట్రంప్ కోసం మోడీ ప్రచారం చేశారని విపక్షాలు అనవసరపు ప్రచారం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే మోడీ హూస్టన్ సభలో ప్రసంగించే సమయంలో ఆబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అనే నినాదం చెప్పడం స్పష్టంగా వినిపించింది. అంతేకాదు వైట్హౌజ్లో దీపావళి వేడుకలు నిర్వహించగానే అక్కడి భారతీయుల్లో ఎంతో సంతోషం ఆనందం వ్యక్తమైందని కూడా చెప్పారు.