జస్టిస్ జోసెఫ్ అనుమానాలు: రాఫెల్ పై జేపీసీతో దర్యాప్తు చేయించగలరా? రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో వేల కోట్ల రూపాయల మేర నిధులు చేతులు మారాయనే ఆరోపణలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ కొన్ని అనుమానాలను వ్యక్తం చేశారని, వాటిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
Justice Joseph of the Supreme Court has opened a huge door into investigation of the RAFALE scam.
— Rahul Gandhi (@RahulGandhi) November 14, 2019
An investigation must now begin in full earnest. A Joint Parliamentary Committee (JPC) must also be set up to probe this scam. #BJPLiesOnRafale pic.twitter.com/JsqZ53kZFP
ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన ఓ ట్వీట్ చేశారు.రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారని రాహుల్ గాంధీ అన్నారు. పిటీషన్ ను కొట్టి వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన కొన్ని కాపీలను ఆయన తన ట్వీట్ కు జత చేశారు. వాటిని రెడ్ మార్క్ చేశారు.
జోసెఫ్ కొన్ని అనుమానాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఈ కేసును పునర్విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ ఇదివరకు రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఫ్రాన్స్ నుంచి 36 యుద్ధ విమానాలను కొనడానికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా 58 వేల కోట్ల రూపాయలను వ్యయం చేసిందని, ఇందులో కొందరు ప్రముఖులకు పెద్ద ఎత్తున లబ్ది కలిగిందని విమర్శించారు. దీనిపై ఇదివరకు దాఖలైన పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అది సంతృప్తికరంగా లేదని అంటూ కేంద్ర మాజీమంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి తదితరులు రివ్యూ పిటీషన్ ను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మరోసారి కొట్టేసింది.