రాహుల్ గాంధీ పిక్నిక్ ఎంజాయ్ చేశారు .. బీహార్ లో ఓటమికి కాంగ్రెస్ నే కారణమన్న ఆర్జేడీ
బీహార్లో ఎన్డీయే కూటమితో హోరాహోరీగా పోరాడిన మహాకూటమి పరాజయం పాలైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహా కూటమి ఓటమికి కాంగ్రెస్ పార్టీయే కారణమని తేజస్వి యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ ఆరోపణలు గుప్పించింది. 'మహా ఘట్ బంధన్ 'లో కాంగ్రెస్ బలహీనమైన పార్టీ అని , అత్యంత పేలవమైన ప్రదర్శన చూపించిందని ఆర్జేడీ నాయకుడు శివానంద్ తివారీ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ సిమ్లాలో తన సోదరి ప్రియాంక గాంధీ ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారని ఆర్జేడీ నేత శివానంద్ తివారీ విమర్శించారు.
రాహుల్ గాంధీ పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నారని ఫైర్ అయిన ఆర్జేడీ నేత
రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
243 సీట్లలో 70 స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేసినప్పటికీ 19 మాత్రమే గెలవగలిగిందని , ఇది సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్రంగా మాటలతో దాడి చేసిన ఆర్జేడీ సీనియర్ నాయకుడు శివానంద్ తివారీ మహా ఘట్ బంధన్ కు కాంగ్రెస్ పార్టీ అడ్డుపుల్లలా మారిందని, ఈ ఓటమికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఫెయిల్ అంటూ మండిపాటు
కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల బరిలో 70 మంది అభ్యర్థులను నిలబెట్టారు, కానీ 70 బహిరంగ ర్యాలీలు కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ మూడు రోజులు వచ్చారు, ప్రియాంక గాంధీ వాద్రా అసలు ఎన్నికల ప్రచారానికే రాలేదన్నారు . కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చినవారు కూడా బీహార్ గురించి తెలియని వారు వచ్చారు. ఇది సరైనది కాదని శివానంద్ తివారీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
70 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ 19 స్థానాల్లో మాత్రమే విజయం
243 స్థానాలకు ఎన్నికల బరిలోకి దిగిన బీహార్ అసెంబ్లీలో 110 సీట్లను గెలుచుకున్న ఆర్జేడీ, కాంగ్రెస్ మరియు వామపక్షాల మహా కూటమి కేవలం 12 సీట్ల తేడాతో మెజారిటీ మార్కును కోల్పోయాయని మండిపడ్డారు. 243 సీట్లలో 70 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ 19 మాత్రమే గెలుచుకోగలిగింది. బీహార్లో 75 సీట్లు గెలుచుకున్న ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది, వామపక్షాలు 17 సీట్లు గెలుచుకున్నాయి. కేవలం 29 సీట్లలో మాత్రమే పోటీ చేసిన వామపక్ష పార్టీలు మంచి పనితీరును కనబరిచాయి. కేవలం కాంగ్రెస్ పార్టీ పేలవమైన ప్రదర్శన బీహార్ పరాజయానికి కారణమని ఆర్జెడి విమర్శిస్తోంది.
బీహార్ లోనే కాదు మిగతా రాష్ట్రాలకు ఇది వర్తిస్తుంది .. కాంగ్రెస్ తీరుపై మండిపాటు
ఆర్జేడీ నేత శివానంద్ తివారీ బీహార్లో మాత్రమే ఇది జరగదని తాను భావిస్తున్నానని , ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గరిష్ట సంఖ్యలో సీట్లపై పోటీ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, కాని వారు గరిష్ట సంఖ్యలో సీట్లను గెలుచుకోవడంలో విఫలమవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ దీని గురించి ఆలోచించాలి అని శివానంద్ తివారి పేర్కొన్నారు.
ఇక్కడ ఎన్నికల టెన్షన్ పీక్స్ లో ఉంటే సిమ్లాలోని ప్రియాంక గాంధీ ఇంట్లో రాహుల్ గాంధీ పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీ అలా నడుస్తుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని నడుపుతున్న విధానం బిజెపికి లాభం చేకూరుస్తోందని ఆరోపించారు.
Recommended Video
నేడు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణం ..
ఇదిలావుండగా, జనతాదళ్ - యునైటెడ్ (జెడి-యు) చీఫ్ నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా నేడు సోమవారం (నవంబర్ 16) సాయంత్రం 4:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 16 నుంచి 17 మంది మంత్రులు కూడా నితీష్ కుమార్తో ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నారు.