ఇది అబద్దాల ప్రభుత్వం .. సూట్ బూట్ సర్కార్ : రైతులకు మద్దతుగా కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
సెప్టెంబర్ లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ. ఏడో రోజు రైతుల ఆందోళన కొనసాగుతున్న సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం సూట్ బూట్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ.
7వ రోజు ఢిల్లీ బోర్డర్ లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు: ఢిల్లీ -నోయిడా బోర్డర్ దిగ్బంధించిన రైతులు
ఢిల్లీ బోర్డర్ లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు .. వ్యవసాయ చట్టాల రద్దుకే డిమాండ్
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ లో భాగంగా పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల రైతులు ఆందోళన బాట పట్టారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ బోర్డర్ లో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. నిన్న కేంద్ర సర్కార్ చర్చలకు రమ్మని ఆహ్వానించి, రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపినా చర్చలు సత్ఫలితాలను ఇవ్వలేదు. రైతులు తమ డిమాండ్ పైనే భీష్మించుకు కూర్చున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి.
వ్యవసాయ చట్టాల ద్వారా ప్రభుత్వం వారి మిత్రులకు నాలుగు రెట్లు ఆదాయం పెంచింది : రాహుల్ గాంధీ
దీంతో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వం చెప్పింది రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని, కానీ ప్రభుత్వం దాని మిత్రుల ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచేలా వ్యవసాయ చట్టాల ద్వారా చేసిందని విమర్శించారు. కేంద్ర వ్యవసాయ చట్టాలతో రైతుల ఆదాయం సగానికి తగ్గుతుందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇది అబద్దాల ప్రభుత్వం , సూట్ బూట్ ప్రభుత్వమని ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న రోడ్ల మీద .. అబద్దాలు జాతీయ టెలివిజన్ ప్రసంగాలలో : రాహుల్ ఫైర్
గత కొద్ది రోజులుగా వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై రైతుల నిరసనలపై రాహుల్ గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న రోడ్లపై నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు, అబద్దాలు జాతీయ టెలివిజన్లలో ప్రసంగాలు చేస్తున్నాయి అంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. రైతుల కృషి మనందరికీ అప్పు. ఈ రుణం వారికి న్యాయం చేయటం ద్వారా మాత్రమే తిరిగి తీరుతుంది అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
అహం పక్కనబెట్టి రైతుల సమస్యలు పరిష్కరించండి .. రాహుల్ ఆగ్రహం
రైతులపై లాఠీచార్జి చేయడం ద్వారా, వారిపై భాష్పవాయువు ప్రయోగించటం ద్వారా కాదు అంటూ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అహాన్ని పక్కనపెట్టి రైతు సమస్యలను పరిష్కరించండి, ఇకనైనా మేల్కొనండి అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఆందోళన చేస్తున్న రైతులలో ఎక్కువ మంది పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు . పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఆమోదించినప్పటినుండి పంజాబ్ రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.
ఆందోళనలో పంజాబ్ రైతులు .. చట్టాలు రద్దు చేసే దాకా నిరసనల ప్రతిజ్ఞ
మొదట్లో వారు రైల్వే ట్రాక్ లపై ఆందోళన కొనసాగించారు. ఆ తర్వాత చలో ఢిల్లీ అంటూ లాంగ్ మార్చ్ ను ప్రకటించారు. హర్యానా పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ డిసెంబర్ 26వ తేదీన ఢిల్లీకి చేరుకున్నారు. అప్పటినుంచి ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. బురారీలోని రాజధాని నిరంకారి మైదానంలో ఒక వర్గం రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగా, మెజారిటీ రైతులు ఢిల్లీ బోర్డర్ లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఆరు నెలలు అయినా సరే ఆందోళన కొనసాగిస్తామని, అప్పుడే వెనుదిరిగి వెళతామని తేల్చి చెప్తున్నారు.