మోడీని గద్దె దింపాల్సిందే.. అవసరమైతే రాహుల్ను ప్రధానిని చేద్దామన్న దీదీ?
Recommended Video
ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీని గద్దె దింపేందుకు విపక్షాలన్నీ ఐక్యతతో ముందుకెళ్తున్నాయి. మోడీని మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు ఏం చేసేందుకైనా సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా తృణమూల్ చీఫ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన చిరకాల వాంఛ అయిన ప్రధాని పదవిని వదులుకునేందుకు దీదీ రెడీ అవుతున్నట్లు సమాచారం.
మమతా బెనర్జీకి కోపం వస్తే అంతే సంగతులు....!
రాహుల్ను ప్రధానిని చేద్దాం
ప్రధాని రేసులో ఉన్న బెంగాల్ సీఎం మమత బెనర్జీ తాజాగా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మోడీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా విపక్ష కూటమిలోని మిగతా పార్టీల వారితో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ప్రతిపాదించినట్లు రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తృణమూల్ సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించకపోయినా... తృణమూల్ వర్గాలు ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని రేసులో మాయా, మమత
సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడే కొద్దీ విపక్ష కూటమి నేతల స్వరం మారుతోంది. మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నప్పటికీ ఆయా పార్టీల నేతల మాత్రం ప్రధాని రేసులో తాము ఉన్నామన్న సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ, బీఎస్పీ చీఫ్ మాయావతి రేసులో ముందున్నామన్న విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలు వెలువడే వరకు ప్రధాని ఎవరన్న నిర్ణయాన్ని పక్కనబెట్టాలని కూటమి నేతలు నిర్ణయించారు. తాజాగా మమత తీసుకున్న నిర్ణయంతో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది.
కూటమిలో మమత కీలకం
దేశంలో ప్రాంతీయపార్టీలన్నీ మోడీని గద్దె దింపేదుకు ఏకమవుతున్నాయి. ఆ ప్రయత్నాల్లో మమత బెనర్జీ కీలక పాత్ర పోషిస్తారని తృణమూల్ చెబుతోంది. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను సైతం మమత పరిశీలిస్తారని, మరోసారి తెలంగాణ సీఎం భేటీకి వస్తే చర్చలు జరిపేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారన్న సంకేతాలు ఇచ్చింది. ప్రాంతీయ పార్టీల కూటమి ప్రయత్నాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఇప్పటికే వైసీపీ నేత జగన్, కేరళ సీఎం విజయన్, డీఎంకే అధినేత స్టాలిన్తో చర్చలు జరిపారు. త్వరలోనే కర్నాటక సీఎం కుమారస్వామితో పాటు మమతతో భేటీ అయ్యే సూచనలున్నాయి.