ఇంజిన్ లో సాంకేతిక లోపాలు: వెనక్కి మళ్లిన విమానం: అందులో రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశ రాజధాని నుంచి శుక్రవారం ఆయన బయలుదేరిన ప్రత్యేక విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీనితో ఆయన మళ్లీ న్యూఢిల్లీకి చేరుకోవాల్సి వచ్చింది. ఇంజిన్ లో ఏర్పడిన లోపాలను సరి చేసిన అనంతరం ఆయన మళ్లీ బయలుదేరి వెళ్లనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Engine trouble on our flight to Patna today! We’ve been forced to return to Delhi. Today’s meetings in Samastipur (Bihar), Balasore (Orissa) & Sangamner (Maharashta) will run late. Apologies for the inconvenience. pic.twitter.com/jfLLjYAgcO
— Rahul Gandhi (@RahulGandhi) April 26, 2019
ముందుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. శుక్రవారం ఆయన బిహార్, ఒడిశా, మహారాష్ట్రల్లో ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలల్లో పాల్గొనాల్సి ఉంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బిహార్ లోని సమస్తిపూర్, ఒడిశాలోని బాలాసోర్, మహారాష్ట్రలోని సంగమనేర్ లల్లో బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ ప్రసంగించాల్సి ఉంది. దీనికోసం ఈ ఉదయం ఆయన స్థానిక ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బిహార్ కు బయలుదేరి వెళ్లారు. పాట్నా విమానాశ్రయంలో దిగిన అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన లేదా హెలికాప్టర్ ద్వారా సమస్తిపూర్ కు వెళ్లడానికి బిహార్ కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోపే ఇంజిన్ లో లోపాలు తలెత్తాయి. ఇంజిన్ నుంచి పెద్ద ఎత్తున శబ్దాలు వెలువడ్డాయి. ఇంజిన్ కు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని పైలెట్లు గ్రహించారు. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఫలితంగా- తన ఎన్నికల ప్రచార షెడ్యూల్ లో స్పల్పంగా మార్పులు చోటు చేసుకుంటాయని రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తెలిపారు.