నిన్న స్మృతి, నేడు రాహుల్ ..నేతల డిగ్రీలపై కాంగ్రెస్, బీజేపీ వార్
విద్యార్హతల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలపై నెలకొన్న వివాదాన్ని కాంగ్రెస్ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయగా.. తాజాగా రాహుల్ ఎంఫిల్పై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ అంశంపై కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఫేస్బుక్ బ్లాగులో ఆర్టికల్ పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
ఆర్జేడీ, జేడీయూ మధ్య మాటల తూటాలు.. బీహార్లో రంజుగా మారిన రాజకీయాలు
పీజీ లేకుండానే ఎంఫిల్
రాహుల్ గాంధీ ఎంఫిల్ పట్టాపై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అనుమానం వ్యక్తం చేశారు. రాహుల్ మాస్టర్స్ డిగ్రీ చేయకుండానే ఎంఫిల్ పూర్తి చేశారని సటైర్ వేశారు. స్మృతి ఇరానీ డిగ్రీపై ప్రతిపక్షాలకు విమర్శలకు కౌంటర్గా ఫేస్బుక్ బ్లాగులో ఆయన ఓ ఆర్టికల్ పోస్ట్ చేశారు. విపక్షాలు ప్రచారానికి ఏ అంశం దొరకకపోవడంతో స్మృతి ఇరానీ డిగ్రీ అంశంపై రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
జైట్లీకి కాంగ్రెస్ చురక
రాహుల్ ఎంఫిల్పై అనుమానం వ్యక్తం చేస్తూ జైట్లీ రాసిన ఆర్టికల్పై కాంగ్రెస్ మండిపడింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ఎంఫిల్ కోర్స్ ఆఫర్ చేస్తోందన్న విషయాన్ని జైట్లీ అలియాస్ బ్లాగ్ మంత్రిగారు తెలుసుకోవాలని చురకలంటించింది. అంతటితో ఆగకుండా ఎవరి కారణంగా ఫ్రెంచ్ ప్రభుత్వం అనిల్ అంబానీకి 143మిలియన్ యూరోల పన్ను బకాయిలు రద్దుచేసిందో కాస్త వివరిస్తారా అని జైట్లీని ప్రశ్నించింది.
గతంలో రాహుల్ డిగ్రీలపై వివాదం
2009లోనూ రాహుల్ గాంధీ డిగ్రీలపై వివాదం తలెత్తింది. దీంతో ఆయన ట్రినిటీ కాలేజ్ స్టూడెంట్ అని, 1995లో ఎంఫిల్ పూర్తి చేశారని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రకటించింది. 1981 -83 మధ్య రాహుల్, ప్రియాంక డెహ్రాడూన్లోని డూన్ స్కూల్లో చదివారు. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం వారిని స్కూల్ మాన్పించి ఇంట్లోనే ఉంచి చదివించారు. ప్లస్ టూ అనంతరం రాహుల్ అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో చేరగా... 1991లో రాజీవ్ గాంధీ హత్య అనంతరం భద్రతా కారణాలరిత్యా రాహుల్ను ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు. 1994లో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. ఆ మరుసటి ఏడాది ట్రినిటీ కాలేజ్ నుంచి ఎంఫిల్ పట్టా అందుకున్నారు.