రాహుల్ గాంధీ గాలి తీసిన ఒబామా..తాను రాసిన కొత్త పుస్తకంలో ఏం చెప్పారంటే..?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన కొత్త పుస్తకం ఎ ప్రామిస్డ్ ల్యాండ్. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రగిల్చిన వేడి ఇంకా చల్లారకముందే మార్కెట్లోకి విడుదలైన ఈ బుక్.. హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ పుస్తకానికి విపరీతమైన డిమాండ్ లభిస్తోంది యూఎస్ మార్కెట్లో. ఇదివరకు ఆయన రాసిన పుస్తకాల విక్రయాలతో పోల్చుకుంటే.. దీనికి ఉన్న గిరాకీ అధికం. భారత్ సహా పలు దేశాలతో అమెరికాకు ఉన్న దౌత్య సంబంధాలు, ఆయా దేశాల పరిపాలకులు, రాజకీయ నేతల గురించి ఇందులో ప్రస్తావించడం దీనికి కారణం.
Recommended Video
యూపీఏ ప్రభుత్వంపై
పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ దీన్ని ప్రచురించింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడటం, దానిపై వివాదాలు చెలరేగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎ ప్రామిస్డ్ ల్యాండ్ బుక్.. టైమ్లీగా విడుదల కావడం కూడా డిమాండ్ అధికంగా ఏర్పడటానికి మరో కారణమైనట్లు అంచనాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో భారత్తో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాం గురించి ప్రస్తావించారు.
పుతిన్.. మన్మోహన్ సింగ్..
మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీల గురించి రాసుకొచ్చారు. రష్యా ప్రధానమంత్రి వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన సొంత పార్టీ నేత జో బిడెన్పైనా తన భావాలను వెల్లడించారు. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను అమెరికా దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. అమెరికా అధ్యక్షుడిగా రెండు దఫాలు కొనసాగిన ఒబామా తన హయాంలో చోటు చేసుకున్న విషయాలను ఇందులో పొందుపరిచారు.
పట్టు సాధించలేకపోతున్నారు..
ప్రత్యేకించి- రాహుల్ గాంధీపై ఒబామాకు ఉన్న వ్యక్తిగత అభిప్రాయం ఏమిటనేది ఈ పుస్తకం స్పష్టం చేసింది. తన దృష్టిలో రాహుల్ గాంధీ.. హోమ్వర్క్ను అందరి కంటే ముందే పూర్తి చేసుకుని, టీచర్ను ఇంప్రెస్ చేయాలనుకునే విద్యార్థి అని బరాక్ ఒబామా ఈ పుస్తకంలో రాశారు. ఈ క్రమంలో ఆ విద్యార్థి తనకు ఇచ్చిన హోమ్ వర్క్కు సంబంధించిన సబ్జెక్ట్పై పట్టును సాధించలేకపోతున్నారని అన్నారు. ఆ సబ్జెక్ట్పై మాస్టర్గా వ్యవహరించలేకపోతున్నారని చెప్పారు.
సోనియాగాంధీపైనా..
ఆ పట్టును సాధించడానికి రాహుల్ గాంధీ చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు. నెర్వస్గా భావించడం, తన నైపుణ్య లక్షణాలను ఇంకా డెవలప్ చేసుకోవాల్సి ఉందని అన్నారు. నెర్వస్, అన్ ఫార్మ్డ్ క్వాలిటీ ఆయనలో ఉన్నాయని చెప్పారు. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ గురించి ఒబామా ప్రస్తావించారు. ఆమెను ఛార్లీ క్రైస్ట్, రెహ్మ ఎమానుయెల్తో పోల్చారు. ఓ మహిళలో పురుషులతో సమానంగా అసాధారణమైన ప్రతిభ ఉందని అన్నారు.
అస్పష్టతలో కొనసాగుతున్న సమర్థ నేత..
మన్మోహన్ సింగ్ సమర్థుడే అయినప్పటికీ.. ఆయనలో అస్పష్టత నెలకొని ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ను డీసెంట్, హానెస్ట్, లాయల్ మ్యాన్గా ఒబామా అభివర్ణించారు. తన పరిపాలనను ఆయన కొనసాగించగలరని వ్యాఖ్యానించారు. బరాక్ ఒబామా డెమొక్రాట్ నాయకుడే. అదే పార్టీకి చెందిన జో బిడెన్ను గెలిపించడానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా పెద్ద ఎత్తున ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఘాటు విమర్శలను సంధిస్తూనే.. జో బిడెన్ కోసం విస్తృతంగా పర్యటించారాయన.