సీబీఐ ఇప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్, బళ్లారి బ్రదర్స్ రూ. లక్ష కోట్లు లూటీ!
Recommended Video
మంగళూరు/ బెంగళూరు: బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ కు క్లీన్ చిట్ ఇవ్వడంతో సీబీఐ ఇప్పుడు సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇల్లీగల్ మైనింగ్ అయ్యిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి విరుచుకుపడ్డారు. శుక్రవారం ఉత్తర కన్నడ జిల్లాలోని బంట్వాళలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ, గాలి జనార్దన్ రెడ్డి మీద రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బళ్లారి బ్రదర్స్ రూ. లక్ష కోట్లు లూటీ చేశారని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.
మోడీ పక్కనే నేరస్తులు
ప్రధాని నరేంద్ర మోడీ బసవణ్ణ విగ్రహాలకు పూలమాలలు వేస్తారు, మరో పక్క బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి సోదరులు ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టిక్కెట్లు ఇస్తారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. తాను అవినీతికి వ్యతిరకం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ గొప్పులు చెప్పిన సమయంలో ఆయన పక్కనే అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన బీఎస్. యడ్యూరప్ప ఉన్నారని రాహుల్ గాంధీ వ్యంగంగా అన్నారు.
మోడీ, అమిత్ షా, గాలి
గాలి జనార్దన్ రెడ్డి సోదరులు వేల కోట్ల రూపాయలు లూటీ చేశారని, ఆ సొత్తు మొత్తం కర్ణాటక పేద ప్రజలదని రాహుల్ గాంధీ అన్నారు. పేద ప్రజల రుణాలు మాఫీ చెయ్యాలనే ఆలోచన ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాకు లేదని, కేవలం 15 మంది శ్రీమంతుల రుణాలు మాత్రం మాఫీ చెయ్యడానికి సిద్దం అయ్యారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
లూటీ బ్యాచ్ ఒక్కటైయ్యింది
2008లో కర్ణాటకను లూటీ చేసిన బ్యాచ్ అంతా ఇప్పుడు ఒక్కటి అయ్యిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఎద్దేవ చేశారు. యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, శోభా కరందాజ్లే, జగదీష్ శెట్టర్, ఈశ్వరప్ప ఇలా అందరూ ఒక్కటి అయ్యారని, వీళ్లకు కొంచెంకూడా సిగ్గు, మానం, మర్యాద లేదని సీఎం సిద్దరమాయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
రెడ్డి బ్రదర్స్ రూ. లక్ష కోట్లు లూటీ
ప్రధాని మోడీ, అమిత్ షా, యడ్యూరప్ప తన ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, గాలి జనార్దన్ రెడ్డి సోదరులు బళ్లారిలో రూ. లక్ష కోట్లకు పైగా లూటీ చేశారని, లోకాయుక్త మాజీ న్యాయమూర్తి సంతోష్ హెగ్డే సైతం తన నివేదికలో ఈ విషయాలు వెల్లడించారని, అయినా వీళ్లు నోరు విప్పడం లేదని, ఆరోజు రెడ్డి బ్రదర్స్ తో కుమ్మక్కు అయ్యింది యడ్యూరప్ప అని సీఎం సిద్దరామయ్య తీవ్రస్థాయిలో విమర్శించారు.
రెడ్డి బ్రదర్స్ గూండాయిజం
గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలు అరికట్టడానికి ఆరోజు తాను బెంగళూరు నుంచి 320 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి బళ్లారి వెళ్లానని సిద్దరామయ్య అన్నారు. బళ్లారిలో గాలి బ్రదర్స్ చెప్పిందే వేదం అన్నారు. బళ్లారిలో ఆ రోజు ఎన్నికల ప్రచారం చెయ్యడానికి తనకు బళ్లారి రెడ్డి బ్రదర్స్ అవకాశం ఇవ్వలేదని, కేవలం టేబుల్, కుర్చి వేసుకుని మాట్లాడి వచ్చానని సీఎం సిద్దరామయ్య అన్నారు.
జైలు పక్షులు వచ్చాయి
అనేక అక్రమాలతో జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ నాయకులు బీఎస్. యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి, హరతాలు హాలప్ప, క్రిష్ణయ్య శెట్టి, కట్టా సుబ్రమణ్య నాయుడు తదితరులు అందరూ ఇప్పుడు ఒక్కటై మళ్లీ కర్ణాటక ప్రజలను లూటీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.