బీజేపీకి షాక్: రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించిన శివసేన, నాడు గుజరాత్, నేడు కర్ణాటకలో!
ముంబై: 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే తాను ప్రధాన మంత్రి అవుతానని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊహించని మద్దతు వచ్చింది. బీజేపీ మిత్రపక్షం అయిన శివసేన రాహుల్ గాంధీకి మద్దతు ప్రకటించి ప్రధాని నరేంద్ర మోడీకి ఊహించని షాక్ ఇచ్చింది.
ప్రతి పౌరుడికి హక్కు
భారతదేశంలోని ప్రతి పౌరుడు తాను ప్రధాన మంత్రి కావాలని ఆశపడే హక్కు ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ తాను భారత ప్రధాన సేవకుడు అని చెప్పుకుంటున్నారని, దేశంలోని ప్రతి సేవకుడు ప్రధాని కావడానికి అవకాశం ఉందని బీజేపీ మిత్రపక్షం అయిన శివసేన పార్టీ సీనియర్ నాయకుడు సంజయ్ రావత్ మీడియాకు చెప్పారు.
వ్యక్తిగత విమర్శలు
కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ప్రధాని నరేంద్ర మోడీ మీద రాహుల్ గాంధీ తన హోదాను మరిచిపోయి వ్యక్తిగత విమర్శలు చేసి తప్పు చేశారని శివసేనకు చెందిన సామ్నా పత్రిక అభిప్రాయం వ్యక్తం చేసింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ బీజేపీకి పెద్ద సవాలుగా మారే అవకాశం లేదని శివసేనకు చెందిన సామ్నా ప్రతిక కథనం ప్రచురించింది.
రాహుల్ ను స్వాగతించండి
కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారం సందర్బంగా రాహుల్ గాంధీ తాను ప్రధాన మంత్రి అవుతాను అని ప్రకటించుకున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ ప్రధాని అవుతాను అంటే బీజేపీ విమర్శించడం మానుకుని స్వాగతించి ఉంటే బాగుండేదని శివసేన అభిప్రాయం వ్యక్తం చేసింది.
రాహుల్ గాంధీని ఓడించండి
ప్రజాప్రభుత్వం మీద బీజేపీకి నమ్మకం ఉంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి వారి సత్తా చాటుకోవాలని శివసేన సూచించింది. రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యాలా ? వద్దా ? అనే విషయం ప్రజలు నిర్ణయిస్తారని, బీజేపీ కాదని శివసేన తన సామ్నా పత్రికలో చురకలు అంటించింది.
రాహుల్ గాంధీ నాయకుడు
2014 లోక్ సభ ఎన్నికలతో పోల్చితే రాహుల్ గాంధీ నాయకుడిగా ఎదిగాడని, అందులో ఎలాంటి సందేహం లేదని, 2017 డిసెంబర్ లో గుజరాత్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఆ విషయం రుజువు అయ్యిందని శివసేన అభిప్రాయం వ్యక్తం చేసింది. గుజరాత్ శాసన సభ ఎన్నికల సందర్బంలో రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తేసిన శివసేన ఇప్పుడు కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా ఆయనకు అంతే మద్దతు ఇచ్చి బీజేపీకి ఝలక్ ఇచ్చింది.