మోడీపై రాహుల్ శివాలు, హోదా కోసం ఏపీ ఎంపీలు
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై గురువారం మండిపడ్డారు. వ్యాపం, లలిత్ గేట్ వివాదం పైన ప్రధాని స్పందించాలన్నారు. అధికారంలో ఉన్నామని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. సుష్మా స్వరాజ్ తప్పు చేశారన్నారు.
కేంద్రం విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. వ్యాపం, లలిత్ గేట్ కేసుల్లో బిజెపి కూరుకుపోయిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ చెప్పిన అవినీతిరహిత పాలన ఇదేనా అని ప్రశ్నించారు. లలిత్ మోడీకి సుష్మా స్వరాజ్ సహకరించారన్నారు.
లోకసభ రేపటికి వాయిదా
విపక్షాల ఆందోళనతో లోకసభ దద్దరిల్లింది. ఉదయం లోకసభ ప్రారంభమైన వెంటనే లలిత్ మోడీ అంశం, వ్యాపం కుంభకోణంపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలన్నారు.
ప్రశ్నోత్తరాలు రద్దుచేసి లలిత్ మోడీ వ్యవహారంపై చర్చించాలని పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శించొద్దని స్పీకర్ వారించినా సభ్యులు పట్టించుకోలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు.
తిలక్ చిత్రపటం వద్ద నివాళులర్పించిన ప్రధాని మోడీ
లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉన్న ఆయన చిత్రపటం వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తదితరులు నివాళులర్పించారు.
పార్లమెంట్ ఆవరణలో తెదేపా ఎంపీల ఆందోళన
ఏపీకి న్యాయం చేయాలని కోరుతూ టిడిపి ఎంపీలు గురువారం ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. విభజన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంలో అన్ని రాజకీయ పార్టీలు తమకు మద్దతివ్వాలన్నారు.