వీడియో: మీ వెంటే ఉంటా..మీ కోసం పోరాడతా! వాయనాడ్లో రాహుల్ గాంధీ రోడ్షో!
వాయనాడ్: మొన్నటి లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించిన వాయనాడ్ నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటానని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు. వాయనాడ్ ప్రజలు తనను అక్కున చేర్చుకున్నారని, వారి విశ్వాసాన్ని తాను వమ్ము చేయబోనని చెప్పారు. వాయనాడ్ లోక్సభ సభ్యునిగా తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలను తెలుపుకోవడానికి ఆయన శుక్రవారం ఇక్కడికి వచ్చారు. వాయనాడ్ లోక్సభ పరిధిలోని కల్పెట్టలో శనివారం ఉదయం రోడ్షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన ఓపెన్ టాప్ జీపులో ప్రయాణించారు. భారీ ఎత్తున గుడికూడిన ప్రజలకు అభివాదం చేశారు. వాయనాడ్ ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని ఆయనకు స్వాగతం పలికారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అనుబంధ సంస్థ ఐయూఎంఎల్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ రోడ్ షోలో సందడి చేస్తూ కనిపించారు. మూడురోజుల పాటు ఆయన వాయనాడ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తారు. అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్తారు.
వీడియో: మీ వెంటే ఉంటా..మీ కోసం పోరాడతా! వాయనాడ్లో రాహుల్ గాంధీ రోడ్షో! pic.twitter.com/0AHe9JyTds
— Oneindia Telugu (@oneindiatelugu) June 8, 2019
ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రాహుల్ గాంధీ వాయనాడ్కు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా రాహుల్ ప్రసంగిస్తూ వాయనాడ్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలను తాను లోక్సభ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. రాజకీయాలకు అతీతంగా స్థానిక సమస్యలపై పోరాడతానని అన్నారు. దేశంలో భారతీయ జనతా పార్టీ విధ్వేషాలను రెచ్చగొట్టి, రాజకీయ లబ్దిని పొందుతోందని, వాటిని తాను ప్రేమ, ఆప్యాయతలతో జయిస్తానని అన్నారు. దేశ ప్రజల పట్ల మోడీ విషాన్ని చిమ్ముతున్నారని చెప్పారు. విభజించి, పాలించు అనే కుతంత్రాన్ని ఆయన అమలు చేస్తున్నారని విమర్శించారు.
ఇష్టానుసారంగా అబద్ధాలను చెప్పి, నోటికి వచ్చిన వాగ్దానాలను ఇచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఇకపై వాటిని సాగనివ్వబోనని అన్నారు. వాయనాడ్లో తన విజయానికి దోహదం చేసిన ప్రతి ఒక్కరికీ తాను ధన్యవాదాలను తెలుపుకొంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని కేరళ సొంతబిడ్డలా ఆదరించిందని, ఆ రుణాన్ని తీర్చుకుంటామని రాహుల్ గాంధీ చెప్పారు. మోడీ సర్కార్ తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.