రాహుల్ గాంధీ: 'ఎమర్జెన్సీ విధించడం ముమ్మాటికీ తప్పిదమే'
దేశంలో అత్యవసర స్థితి విధించాలని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయం తప్పిదమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మంగళవారం ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ కౌశిక్ బసుతో మాట్లాడుతూ అన్నారు.
1975 నుంచి 1977 మధ్య 21 నెలలపాటు విధించిన ఎమర్జెన్సీ సమయంలో జరిగిందంతా తప్పే అన్నారు.
ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ హక్కులు, పౌర స్వేచ్ఛను అడ్డుకున్నారని, ప్రెస్ మీద నిషేధం విధించారని, ప్రతిపక్ష నేతలను భారీ సంఖ్యలో జైళ్లలో బంధించారని కూడా రాహుల్ అన్నారు. కానీ, అవన్నీ ప్రస్తుత పరిస్థితులకు పూర్తిగా భిన్నమైనవని అన్నారు.
https://twitter.com/RahulGandhi/status/1366760150967623687
"అది ఒక తప్పిదమని, పూర్తిగా తప్పుడు నిర్ణయమని నేను ఒప్పుకుంటున్నా. ఆ నిర్ణయం తీసుకుంది మా నానమ్మే(ఇందిరాగాంధీ). కానీ, భారత సంస్థాగత నిర్మాణాన్ని స్వాధీనం చేసుకోడానికి అప్పటి కాంగ్రెస్ ప్రయత్నించలేదు. నిజం చెప్పాలంటే, ఆ సామర్థ్యం కూడా లేదు. అలా చేయడానికి కాంగ్రెస్ భావజాలం మమ్మల్ని అనుమతించదు" అని కూడా రాహుల్ గాంధీ ప్రొఫెసర్ బసుతో అన్నారు.
అత్యవసర స్థితి సమయంలో జైళ్లలో గడిపిన అధికార బీజేపీ నేతలు, దాని గురించి ఎప్పుడూ కాంగ్రెస్ను విమర్శిస్తూ వచ్చారు.
ముఖ్యంగా కాంగ్రెస్ భావప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి తెలియజేసే హక్కు గురించి బీజేపీని ప్రశ్నించినపుడు అది జరుగుతుంది.
"ఒక కుటుంబం అధికార కాంక్షతో రాత్రికిరాత్రే మొత్తం దేశాన్ని జైలుగా మార్చిందని" గత ఏడాది జూన్లో కాంగ్రెస్, నెహ్రూ-గాంధీ కుటుంబంపై విమర్శలు సంధించిన హోంమంత్రి అమిత్ షా అన్నారు.
ఎమర్జెన్సీకి, ఈరోజు జరుగుతున్నదానికి వ్యత్యాసం ఉందని మంగళవారం మాట్లాడిన రాహుల్ గాంధీ అన్నారు.
సంస్థల్లో ఆర్ఎస్ఎస్ తమవారిని నింపుతోంది. ఎన్నికల్లో మేం బీజేపీని ఓడించినప్పటికీ మేం సంస్థాగత నిర్మాణంలో కూర్చుని ఉన్న వారి నుంచి విముక్తి పొందలేం అన్నారు.
https://twitter.com/RahulGandhi/status/1365972957923663872
"ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకు సంస్థాగత సమతుల్యతే కారణం. సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయి. ఆర్ఎస్ఎస్ అనే భారతదేశంలోని అతిపెద్ద సంస్థ ఆ సంస్థల స్వేచ్ఛపై దాడి చేస్తోంది. అది, పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తున్నారని మేం అనడం లేదు, దానిని నాశనం చేస్తున్నారు" అన్నారు.
కౌశిక్ బసుతో మాట్లాడే సమయంలో రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తనకు చెప్పిన ఒక విషయాన్ని పంచుకున్నారు.
"కమల్నాథ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక సీనియర్ ఉద్యోగి తన ఆదేశాలు పాటించడం లేదని, ఎందుకంటే వాళ్లంతా ఆర్ఎస్ఎస్కు సంబంధించినవారని ఆయన చెప్పారు. అందుకే, ఇప్పుడు ఏదైతే జరుగుతోందో అదంతా ఎమర్జెన్సీకి పూర్తి భిన్నంగా ఉంది" అని చెప్పారు.
కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి కూడా రాహుల్ మాట్లాడారు.
"పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పొత్తు విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి మధ్య మాటామాటా వచ్చింది. ఆనంద్ శర్మ జీ-23లో భాగం, ఆ బృందంలోని చాలామంది నేతలు పార్టీ అగ్ర నాయకత్వంపై కోపంగా ఉన్నారు" అన్నారు.
"పార్టీ లోపలి ప్రజాస్వామ్య ఎన్నిక గురించి మాట్లాడిన మొదటి వ్యక్తిని నేనే. ఇక్కడ ఆసక్తికరమైనది ఏంటంటే, ఇలాంటి ప్రశ్నలు మిగతా పార్టీల్లో తలెత్తవు. బీజేపీ, బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం గురించి ఎవరూ మాట్లాడరు. నేను యూత్ కాంగ్రెస్ ఎన్నికలు జరిపించాను, పార్టీలో దాని తరఫున వాదించాను" అన్నారు రాహుల్.
భారత ప్రజాస్వామ్యం తీవ్ర సంక్షోభంలో ఉందని రాహుల్ గాంధీ అన్నారు.
"ఒక ప్రజాస్వామ్యం దాని ఇన్స్టిట్యూషనల్ స్వేచ్ఛతో నడుస్తుంది. కానీ భారత్లోని ప్రస్తుత వ్యవస్థలో ఆ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. భారత్లో అన్ని సంస్థల మీదా ఆర్ఎస్ఎస్ దాడి జరుగుతోంది. న్యాయవ్యవస్థ, ఎన్నికల కమిషన్, బ్యూరోక్రసీ, మీడియాలో ఆర్ఎస్ఎస్ తన వాళ్లను కూచోపెడుతోంది. ఈ సంస్థల నుంచి మద్దతు లభించినప్పుడే ఒక నేతగా నా పని నేను చేయగలను. నాకు, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్, మిగతా సంస్థల నుంచి సాయం అందితేనే నేను నా పని చేయగలను. లేదంటే అది సాధ్యం కాదు. పార్లమెంటులో చర్చ కూడా జరగనివ్వడం లేదు" అని రాహుల్ చెప్పారు.
"ఈజిఫ్టులో హోస్నీ ముబారక్ 97 శాతం ఓట్లతో ఎన్నికల్లో గెలిచారు. అదెలా సాధ్యం అని నేను ఆశ్చర్యపోయా. దాని గురించి తెలుసుకోవాలని అనుకున్నా. అక్కడ పోలింగ్ బూత్ నుంచే అంతా కుమ్మక్కైనట్లు నాకు అనిపించింది. నేను అనుకోకుండా ఈజిఫ్టులో ఒక కాన్ఫరెన్సుకు వెళ్లాను. ఆ రాజకీయ సమావేశంలో స్థానిక జడ్జి కూర్చుని ఉండడం నాకు కనిపించింది. జడ్జి ఇక్కడ ఎందుకున్నాడు అనుకున్నా. ఈజిఫ్ట్ ప్రభుత్వం ముందు ఎలాంటి సంస్థా ఉండదు. భారత్లో ఇప్పుడు అదే జరుగుతోంది. పుదుచ్చేరిలో గవర్నర్ ప్రభుత్వాన్ని ఏ పనీ చేయనిచ్చేవారు కాదు, ఎందుకంటే ఆమె ఆర్ఎస్ఎస్ కాబట్టి. మణిపూర్లో కూడా అదే జరుగుతోంది" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- విజయవాడ టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా
- కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- కరోనావైరస్: ప్రపంచమంతా సుగంధ ద్రవ్యాలకు భారీగా పెరిగిన గిరాకీ.. పండించే రైతులకు మాత్రం కష్టాలు రెట్టింపు
- స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)