మొన్న అసద్, నిన్న రాహుల్..! ఆరోగ్యసేతుపై అనుచిత వాఖ్యలు..! అసలు నిజం ఇదేనా..!!
ఢిల్లీ/హైదరాబాద్ : మొన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, నిన్న కాంగ్రెస్ పార్టీ వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోగ్యసేతు యాప్ గురించి వినూత్న సందేహాలను వ్యక్తం చేసారు. కరోనా వైరస్ క్లిష్ట సమయంలో దేశ ప్రజల ఆరోగ్య స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆరోగ్యసేతు యాప్ పై అనుమానాలు వ్యక్తం చేసారు. ఆరోగ్యసేతు యాప్ లో పొందు పరిచిన అంశాలు దేశ పౌరుల వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించే విధంగా ఉన్నాయనే సందేహాలను రాహుల్ గాందీ వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వం తగు వివరణ, భరోసా కల్పించిన తర్వాతే యాప్ ఉపయోగాన్ని అమలులోకి తీసకురావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించినట్టు తెలుస్తోంది.
ఆరోగ్యసేతూ యాప్ రాహుల్ గాందీ సందేహాలు.. తోసిపుచ్చిన కేంద్ర వర్గాలు..
ఇదిలా ఉండగా ఎంపి స్థాయిలో ఉన్న రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న పథకం గురించి అవగాహనారాహిత్యంగా మాట్లాడటం సమంజసంగా లేదని కేంద్ర వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఆరోగ్య సేతు యాప్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు తప్పని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఆరోగ్య సేతు అనేది కరోనా వైరస్ నుంచి ప్రజలను అప్రమత్తం చేయడానికి, రక్షించడానికి ఉపయోగపడే యాప్ మాత్రమే అని పేర్కొంది. దీనివల్ల కరోనా విస్తరణ ఎలా ఉందనేది ప్రజలకు, ప్రభుత్వానికి తెలియడమే కాకుండా, దేశ పౌరులను రక్షించుకోవడానికి ఉపయోగపడే సురక్షిత పథకమని కేంద్రం పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది.. పొరపాట్లకు ఆస్కారం ఉండదంటున్న కేంద్రం..
కాగా ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ ఒకరు ఆరోగ్యసేతు యాప్ పై చేసిన ఆరోపణను కూడా కేంద్రం కొట్టివేసింది. ఆరోగ్య సేతులో ప్రజలు ఇచ్చే సమాచారం అప్పటికే ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారమే గాని కొత్త సమాచారం కాదని, ఇది కేవలం కరోనా వారియర్ గా ప్రజలను కాపాడుతుందన్నారు. ఏ ఒక్కరికి దీనివల్ల ప్రమాదం సంభవించిందని ఇంతవరకూ ఏ ఒక్కరూ నిరూపించలేకపోయారని, దీనికి కారణం, ఆ యాప్ లో ఉన్న పారదర్శకత, ఎలాంటి లోపం లేకపోవడమే కారణమని కేంద్ర వర్గాలు అభివర్ణిస్తున్నాయి. ఆరోగ్యసేతు పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుందని, వినియోగదారుల భద్రతకు, గోప్యతకు ఎటువంటి భంగం ఉండదని ప్రభుత్వం పేర్కొంది.
కేంద్ర పథకాలపై కాంగ్రెస్ అవగాహనా రాహిత్యం.. విమర్శిస్తే సహించేది లేదంటున్న బీజేపి..
మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీ దీనిపై విమర్శలు చేస్తూ వస్తోందని ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతే కాకుండా ప్రజలు వాడుతున్న ప్రైవేటు యాప్స్ తీసుకుంటున్న సమాచారం కంటే చాలా తక్కువ సమాచారం మాత్రమే ఇది తీసుకుంటోందన్నారు. ప్రదేశాల ఆధారంగా రూపొందించిన ఈ యాప్ లొకేషన్ ట్రేస్ చేస్తారని ప్రచారం చేయడం మంచి చర్యలు కావని చెప్పుకొస్తోంది కేంద్రం. ప్రజలకు సమీనంలో ఉన్న కరోనా ప్రమాదం నుంచి దేశ పౌరులను కాపాడటమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశం అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
వ్యక్తిగత గోప్యతకు భంగం ఉండదు.. నిర్బయంగా యాప్ ను వాడుకోవచ్చంటున్న కేంద్రం..
ఆరోగ్య సేతు గురించి వచ్చే విమర్శలపై బీజేపీ నేతలు కూడా స్పందించారు. జొమాటో, ఉబర్, గేమ్స్, ఓలా, వంటి అనేక ప్రైవేటు యాప్ లకు వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తున్న ప్రజలు, ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రజల ప్రయోజనం కోసం నిర్వహిస్తున్న యాప్ పై సమాచారం ఇస్తుంటే విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆరోగ్య సేతు కరోనా నుంచి మనదేశాన్ని కాపాడే యాప్, దాని గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం ఏ మాత్రం సబబు కాదని బీజేపీ నేతలు విమర్శించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారని ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా వాస్తవాలకు బిన్నంగా యాప్ గురించి సందేహాలు వ్యక్తం చేయడం సబబుగా లేదని కేంద్ర వర్గాలు చెప్పుకొస్తున్నాయి.