కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ పటేల్, మసూద్ అజహర్ను వదిలేసిందే బీజేపీ.. రాహుల్ గాంధీ
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా స్వరాష్ట్రం గుజరాత్కు చెందిన పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ను కాంగ్రెస్ తమ పార్టీలో చేర్చుకుంది. హార్దిక్ మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
సైన్యం నుంచి దక్షిణాది వరకు: మళ్లీ నరేంద్ర మోడీనే ఎందుకు గెలిపించాలంటే?
పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి పేరిట పాటీదార్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని హార్దిక్ పోరాడుతున్నారు. 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్కు మద్దతునిచ్చారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తరఫున జామ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ పటేళ్ల ఆందోళన కేసులో కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించడం అవరోధంగా మారే అవకాశముంది. హార్దిక్ పటేల్ గెలుస్తారని రాహుల్ గాంధీ అన్నారు.
అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్మారక్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికల సన్నాహాల గురించి చర్చిస్తున్నారు. రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. దాదాపు 58 ఏళ్ల తర్వాత గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న సమావేశం ఇదే కావడం గమనార్హం.
దేశంలో అతిపెద్ద సమస్య నిరుద్యోగం అని రాహుల్ గాంధీ అన్నారు. 45 ఏళ్లలో అతి ఎక్కువ నిరుద్యోగం ఇప్పుడే ఉందని చెప్పారు. జైష్ ఏ మహ్మద్ అజహర్ మసూద్ అజహర్ను అసలు ఎవరు విడిచి పెట్టారని ప్రశ్నించారు. పాకిస్తాన్కు మసూద్ అజహర్ను అప్పగించిందే నాటి ఎన్డీయే ప్రభుత్వం అన్నారు. పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారిని విడిచిపెట్టింది వారే అన్నారు. మసూద్ను కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేస్తే ఎన్డీయే విడిచి పెట్టిందని ధ్వజమెత్తారు. యువత, రైతులకు మోడీ ఏమీ చేయలేదన్నారు. తాము అధికారంలోకి రాగానే గుజరాత్లో రైతు రుణమాఫీ చేస్తామన్నారు.
కాగా, కాందాహార్ హైజాక్ సమయంలో 200 మందితో కూడిన విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అందులోని వారిని కాపాడుకునేందుకు నాడు అన్ని పార్టీల ఆమోదంతో వాజపేయి ప్రభుత్వం అజహర్ను విడిచి పెట్టింది. అప్పుడు తెలుగుదేశం వంటి పార్టీలు కూడా ఎన్డీయేలోనే ఉన్నాయి. పైగా అన్ని పార్టీల ఆమోదంతో విడుదల చేశారు. ప్రయాణీకులను కాపాడుకున్నారు.