కొత్త పాత్రలో రాహుల్ గాంధీ- మోడీ సర్కారుకు దిశానిర్దేశం- సర్వత్రా ప్రశంసలు..
గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండోసారి ఘోరపరాజయం ఎదుర్కొన్న నేపథ్యంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎంతో పరిణతి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా కరోనా సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సలహా బృందంలో సాధారణ సభ్యుడిగా ఉంటూనే వ్యూహాలు రచిస్తున్న రాహుల్.. మరోవైపు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని ఇంటర్వూలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ను వీడియో కాల్ ద్వారా చేసిన ఇంటర్వ్యూ ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.
కొత్త పాత్రలో రాహుల్... ఇంటర్వ్యూలతో...
ఒకప్పుడు రాహుల్ గాంధీ పేరు చెబితే ఆయన చంచల మనస్తత్వం, దేనిపైనా పూర్తిగా దృష్టిపెట్టలేని కుర్రతనం కనిపించేవి. పార్లమెంటులో ఏకంగా ప్రదాని మోడీని కౌగిలించుకుని సంచలనం రేపిన రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా పరిగణించాలో లేదో కూడా కాంగ్రెస్ పార్టీ తేల్చుకోలేని పరిస్ధితి. అలాంటిది సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో అధ్యక్ష పదవికి దూరంగా ఉంటూ ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఆసక్తి రేపుతున్నాయి.
తాజాగా కరోనా సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన వ్యూహ బృందంలో రాహుల్ సభ్యుడిగా ఉన్నారు. అదే సమయంలో దేశంలో వివిధ రంగాల్లో నిఫుణుల నుంచి సంక్షోభ పరిష్కారంపై ఇంటర్వ్యూల ద్వారా అభిప్రాయాలు సేకరించాలని తీసుకున్న నిర్ణయం ఆయన కెరీర్ నే మలుపు తిప్పేలా కనిపిస్తోంది.
దేశంలో కరోనా సంక్షోభం... కాంగ్రెస్ లోనూ...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తితో సంక్షోభం నెలకొనగా... అటు కాంగ్రెస్ పార్టీ కూడా అతి తక్కువ రాష్ట్రాల్లో అధికారంతో సంక్షోభం అంచున నిలబడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో తాను సవాళ్లను ఎదుర్కొని నిలబడే నేతగా నిరూపించుకునేందుకు రాహుల్ కు చక్కటి అవకాశం లభించింది. కరోనా సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించాలంటే ఎలాంటి పరిష్కారాలు కావాలనే దానిపై ఇప్పుడు కేంద్రం జరుపుతున్న చర్చలు ఓ ఎత్తయితే.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహబృందం జరుపుతున్న చర్చలు మరో ఎత్తు. ఓవైపు వీటిలో భాగస్వామి అవుతూనే.. మరోవైపు తాను వ్యక్తిగతంగా నిపుణుల అభిప్రాయాలు సేకరించడం ద్వారా రాహుల్ గాంధీ పరిణతిని ప్రదర్శిస్తున్నారు.
రాహుల్ బాటను స్వాగతిస్తున్న కేంద్రం...
గతేడాది సార్వత్రిక పోరులో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశంలో నామమాత్రంగా మారిపోయింది. యూపీ, బీహార్ తో పాటు దక్షిణాదిలోనూ ఏ పెద్ద రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో లేదు. ఇలాంటి సమయంలో కేంద్రం కరోనా సంక్షోభం విషయంలో తీసుకుంటున్న చర్యలను ఏదో రూపంలో విమర్శిస్తే జనం హర్షించే పరిస్ధితుల్లో లేరు.
దీంతో విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ .. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చిన్న, మధ్య తరహా పరిశ్రమల విషయంలో కానీ, వలస కార్మికులను స్వస్ధలాకు తరలింపు విషయంలో కానీ రాహుల్ ఇచ్చిన సలహాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. దీంతో రాహుల్ కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా ప్రజాదరణ చూరగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
Recommended Video
రాహుల్ ప్రయత్నాలకు మద్దతు...
తాజాగా ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయాలను ఇంటర్వూ ద్వారా సేకరించిన రాహుల్ గాంధీ... త్వరలో దేశంలోని ప్రముఖ వైరాలజిస్టులు, హెల్త్ కేర్ నిపుణులు, ఆర్దిక వేత్తలు, రాజకీయ నేతల సూచనలు కూడా తీసుకునేందుకు సై అంటున్నారు. జర్నలిస్టుగా మారి రాహుల్ గాంధీ చేస్తున్న అభిప్రాయసేకరణ సాధారణ ప్రజల్లోనూ సానుకూల సంకేతాలు పంపుతోంది.
ఇన్నాళ్లూ రాహుల్ గాంధీలో కేవలం మోడీపై ఏదో రకంగా విమర్శలు చేసే సగటు రాజకీయ నాయకుడిని మాత్రమే చూసిన జనం.. ఇప్పుడు సంక్షోభ సమయంలో కేంద్రానికి మార్గదర్శనం చేస్తున్న ఓ పరిణితి చెందిన నేతను చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన సొంత పార్టీ కాంగ్రెస్ కూడా యువనేత నుంచి ఇదే కోరుకుంటోంది.