రాహుల్ నయా ప్లాన్: పట్టుదక్కితేనే ప్రధాని... మెజార్టీ తగ్గితే మరొకరికి ఛాన్స్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరువిడతల పోలింగ్ ఆదివారంతో ముగిసింది. మరో ఒక్క విడత మాత్రమే పోలింగ్ మిగిలిఉండటంతో ఆయా పార్టీలకు ఇప్పటికే ఒక రకమైన స్పష్టత వచ్చేసింది. బీజేపీకి కూడా స్పష్టమైన మెజార్టీ వచ్చేలా పరిస్థితి కనిపించడం లేదు. అయినప్పటికీ మిత్రపక్షాల సహకారంతో అధికారం తిరిగి చేపడుతామనే విశ్వాసం కమలనాథుల్లో మెండుగా కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్లో మాత్రం పరిస్థితి కలవరపాటుకు గురిచేస్తోంది. మోడీ, బీజేపీ లక్ష్యంగా మహాకూటమితో కలిసి వెళుతున్న కాంగ్రెస్కు... ఆ కూటమిలోని ఇతర పార్టీలకు మెజార్టీ స్థానాలు వచ్చి సొంతంగా కాంగ్రెస్కు రాకపోతే రాహుల్ ప్రధాని అభ్యర్థి ఉండరనే చర్చ కూటమిలో జోరుగా జరుగుతోంది.
కాంగ్రెస్కు సొంతంగా మెజార్టీ సీట్లు రాకుంటే రాహుల్ పరిస్థితేంటి..?
బీజేపీ ఏన్డీయేతర పార్టీలు మహాకూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కూటమిగా ఏర్పడినప్పటికీ అందులో గందరగోళం ఉండనే ఉంది. మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన భూమిక పోషిస్తోంది. అయితే మహాకూటమిలో ఉన్న కొన్ని పార్టీలు కాంగ్రెస్తో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్లో ఎవరికి వారే పోటీ చేశారు. ఢిల్లీలో ఆప్ సొంతంగా పోటీచేసింది. ఏపీలో కాంగ్రెస్ సొంతంగా పోటీచేసింది. కానీ కూటమిలో మాత్రం ఆప్, టీఎంసీ, టీడీపీలు ఉన్నాయి. ఇక ఉత్తర్ ప్రదేశ్లో కూడా కాంగ్రెస్ సొంతంగా పోటీచేయడంతో ఇబ్బంది తప్పడం లేదు. అక్కడ మాయావతి అఖిలేష్లు కలిసి పోటీచేశారు. ఒక వేళ కాంగ్రెస్కు సొంతంగా మెజార్టీ స్థానాలు రాకపోతే ప్రధాని రేసులోనుంచి రాహుల్ గాంధీ పక్కకు తప్పుకునేలా సమీకరణాలు మారే అవకాశం ఉంది.
గతంలో కాంగ్రెస్ చరిత్ర ఇదీ..!
1989 ఎన్నికల్లో కాంగ్రెస్ 197 స్థానాలు గెలిచింది. కానీ ప్రధాని పదవి తీసుకోలేకపోయింది. వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోయాకా, మరొకరికి స్వల్పకాలిక మద్దతు ఇచ్చి ఆ తర్వాత 1991లో ఎన్నికలు వచ్చేలా పరిస్థితిని సృష్టించింది. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చినప్పటికీ సోనియాగాంధీ ప్రధాని కాలేకపోయారు. ఇందుకు కారణం కాంగ్రెస్ సొంతంగా మెజార్టీ స్థానాలు గెలవకపోవడమే. దీంతో యూపీఏ ప్రభుత్వాన్ని నడిపించేందుకు ప్రధానిగా మన్మోహన్ సింగ్ తెరపైకొచ్చారు. 2009లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది.ఈ నేపథ్యంలోనే ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 272 స్థానాలు వస్తేనే రాహుల్ ప్రధాని అయ్యేందుకు లైన్ క్లియర్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లేదంటే యూపీఏ నుంచి కానీ బయట పార్టీల నుంచి కానీ ప్రధాని అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.
అటు ఇటు అయితే రంగంలోకి కాంగ్రెస్ సీనియర్లు
యూపీఏకు మెజార్టీ స్థానాలు వచ్చి అందులో సొంతంగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు రాకపోతే రాహుల్ ప్రధాని రేసులో ఉండరనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలోనే ప్రధాని అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్గెహ్లాట్లను బీజేపీకి దూరంగా ఉంటున్న పార్టీలను రాహుల్కు మద్దతుగా నిలిచేలా చర్చలు జరపాల్సిందిగా కోరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానిగా మోడీకి రెండో సారి అవకాశం ఇవ్వకూడదన్న అభిప్రాయంతో ఉన్న బీజేపీయేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులతో లాబీయింగ్ చేయాల్సిందిగా కాంగ్రెస్ సీనియర్ నేతలైన చిదంబరం, గులాంనబీ ఆజాద్, ఆంటోనీలతో పాటు మరికొంతమందిని ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దింపే ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో భాగంగానే వీరంతా ప్రాంతీయ పార్టీ అధినేతలైన కేసీఆర్, వైయస్ జగన్, అఖిలేష్ యాదవ్, మాయావతి, నవీన్ పట్నాయక్లాంటి నేతలతో చర్చలకు పంపాలని యోచిస్తోంది.
సమీకరణాలు మారితే కాంగ్రెస్ ఆప్షన్ ఏంటి..?
ఇక ఒక్కసారి చరిత్ర చూస్తే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీలు కాంగ్రెస్కు పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినప్పుడు మాత్రమే ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మిగతా సమయంలో నరసింహారావు, మన్మోహన్ సింగ్లాంటి వారు ప్రధాని అయ్యారు. ఇక్కడ లాల్బహదూర్ శాస్త్రి మినహాయించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ప్రశంసల వర్షం కురిపించడం ద్వారా మాయావతి మద్దతు కోరే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినన్ని సీట్లు తెచ్చుకోలేకపోతే.. ఇతర పార్టీల నుంచి ప్రధాని అభ్యర్థిని డిసైడ్ చేయాలనే ఆప్షన్ కాంగ్రెస్ తన వద్దే ఉంచుకుంది. అంటే కాంగ్రెస్ మాత్రమే మరో పార్టీకి చెందిన అభ్యర్థిని ప్రధానిగా డిక్లేర్ చేసే అవకాశాలను పరిశీలిస్తోంది.
మొత్తానికి ఈ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా జరగడంతో ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారుతున్నాయి. ఇది పసిగట్టిన జాతీయ పార్టీలు అప్పుడే తమదైన శైలిలో లాబీయింగ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతీయ పార్టీలు ఎవరివైపు మొగ్గు చూపుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.