కర్ణాటక పైనా రాహుల్ దృష్టి!.. సీఎం సిద్ధరామయ్య టీమ్ సమావేశం?
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో మరో పర్యాయం కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంపై కూడా దృష్టి సారించారు.
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో మరో పర్యాయం కాంగ్రెస్ను అధికారంలోకి తేవడంపై కూడా దృష్టి సారించారు.
వచ్చే ఏడాది ప్రథమార్థంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సహా కర్ణాటక పార్టీ నేతలతో రాహుల్ గురువారం న్యూఢిల్లీలో సమావేశం కానున్నారు.
కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మరో నలుగురు కార్యదర్శులు, సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర, వర్కింగ్ ప్రెసిడెంట్స్ దినేష్ గుండూరురావు, ఎస్.ఆర్.పాటిల్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డీకే శివకుమార్ తదితరులు సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశానికి హాజరుకానున్నారు.
ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా రాహుల్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి రాహుల్ ఎప్పుడు శ్రీకారం చుట్టాలనేది కూడా ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు. అక్టోబర్ చివర్లో రాహుల్ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.