అనిల్ అంబానీకి మాత్రమే మోడీ కాపలాదారుడు: రాహుల్ గాంధీ
బీహార్ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చౌకీదార్ అంశంపై మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు. బీహార్లో ఓ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు తీవ్రస్థాయిలో ప్రధాని పై విరుచుకుపడ్డారు. ప్రధాని ప్రచారం చేస్తున్న మై భీ చౌకీదార్ నినాదంపై మండిపడ్డారు రాహుల్. ప్రధాని కేవలం ధనికులకు ధనవంతులకు మాత్రమే కాపలాదారుడిగా ఉన్నారని ధ్వజమెత్తారు. మోడీ చౌకీదార్ నినాదంపై కాంగ్రెస్ రివర్స్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. చౌకీదార్ చోర్ హే అనే నినాదాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో ప్రతి బీజేపీ నేత కార్యకర్త తమ ప్రొఫైల్ ముందు చౌకీదార్ అనే పదాన్ని చేర్చుకున్నారు.
అనిల్ అంబానీకి నీరవ్ మోడీకి ప్రధాని కాపలాదారుడు
సాధారణంగా ధనవంతులే వారి ఇళ్లకు వాచ్మెన్లు పెట్టుకుంటారన్న రాహుల్ గాంధీ... ఎక్కడైనా సామాన్యుడి ఇంటికి చౌకీదార్ ఉండటం చూశారా అని ప్రజలను ప్రశ్నించారు రాహుల్ గాంధీ. బీహార్లో తొలి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.... ప్రధాని మోడీ అనిల్ అంబానీకి, నీరవ్ మోడీకి, మెహుల్ చోక్సీలకు కాపలాదారుడిగా వ్యవహరించారని ధ్వజమెత్తారు రాహుల్. వారందరిని భాయ్ అని మోడీ సంబోదిస్తారని... మీలాంటి సామాన్యులను మాత్రం స్నేహితులారా అని పిలుస్తారని రాహుల్ చెప్పారు.
ప్రతి హామీని మోడీ విస్మరించారు
ఇక 2014 ఎన్నికల సమయంలో నాటి ప్రధాని అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోడీ తాము అధికారంలోకి వస్తే ప్రతి వ్యక్తి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మాటతప్పారని చెప్పారు. ఐదేళ్లలో 5 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇవన్నీ నెరవేర్చారా అని ప్రశ్నించారు. రైతుల కోసం ఏదైనా మంచిని చేశారా అని ప్రశ్నించారు రాహుల్. ఇక కాంగ్రెస్ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్లో రుణమాఫీ చేసిందని చెప్పారు
ఒడిషా బీజేపీలో టికెట్ లొళ్లి... పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తాళాలు వేసిన అసంతృప్తులు
పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బంది పడ్డది సామాన్యుడు
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే కనీస ఆదాయం కింద ఉన్న కుటుంబాలను గుర్తించి వారి ఖాతాలోకి నేరుగా నగదు బదిలీ చేస్తామని చెప్పారు. ఇక పెద్ద నోట్ల రద్దు గురించి మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ద నోట్లతో నల్లధనంకు చెక్ పెట్టొచ్చని చెప్పారని అయితే... సామాన్యుడు ఇబ్బంది పడ్డాడని అన్నారు. మోడీ ప్రభుత్వం ధనవంతులు చేసిన రూ.3.5 లక్షల కోట్లు మాఫీ చేయగలిగినప్పుడు సామాన్యులు, రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయదని ప్రశ్నించారు.