గాలి మరలతో నీరు, ఆక్సిజన్ ఉత్పత్తి - ప్రధాని మోదీ ఐడియాపై దుమారం - రాహుల్ సెటైర్లు -బీజేపీ ఎదురుదాడి
సైన్స్ పట్ల, టెక్నాలజీలో కొత్త మలుపుల పట్ల జిజ్ఞాసను ఏనాడూ దాచుకోని ప్రధాని నరేంద్ర మోదీ.. ఏకంగా ఆవిష్కర్తలకే ఐడియాలు చెప్పడం కొత్తే కాదు. కీలకమైన సైంటిఫిక్ అంశాలపై గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల మాదిరిగానే ఈసారి 'టర్బైన్ థియరీ' కామెంట్లపైనా సోషల్ మీడియాలో దుమారం చెలరేగింది. ప్రధాని అవగాహనలేమిని ఎత్తి చూపుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెటైర్లు వేయగా, మోదీ థియరీ కరెక్టేనంటూ బీజేపీ నేతలు, మంత్రులు ఎదురుదాడికి దిగారు.
అమెరికాలో తీవ్ర కలకలం: మిచిగన్ గవర్నర్ కిడ్నాప్కు కుట్ర - 13 మంది అరెస్ట్ - ట్రంప్ వల్లేనంటూ
అసలేం జరిగిందంటే..
మారుతోన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అన్ని దేశాలూ సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టిసారించడం, భారత్ లోనూ సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేయడం తెలిసిందే. ఈ క్రమంలో డెన్మార్క్ దేశానికి చెందిన ప్రఖ్యాత ‘వెస్టాస్' సంస్థ భారత్ కోసం తక్కువ ధరలో లభ్యమయ్యే విండ్ టర్బైన్లను రూపొందించింది. భారత్ లో వెస్టాస్ విండ్ టైర్బైన్ల వ్యాప్తికి సంబంధించి ఆ సంస్థ సీఈవో హెన్రిక్ అడర్సన్ రెండ్రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఆ భేటీలో కొత్త రకం ఐడియాలు ప్రతిపాదించిన మోదీపై ట్రోలింగ్ జరిగింది..
మోదీ టర్బైన్ థియరీ..
విండ్ పవర్ కోసం వాడే టర్బైన్ల ద్వారా... గాలిలోని తేమను సంగ్రహించి.. మంచి నీటిని సమకూర్చుకునే దిశగా ‘వెస్టాస్' ప్రయత్నించాలని, తద్వారా నీటి కరువు ఎక్కువగా ఉండే తీర ప్రాంతాలకు ఉపశమనం లభిస్తుందని మోదీ సూచించారు. అదే సమయంలో టైర్బైన్ల ద్వారా గాలిలోని ఆక్సిజన్ ను ఒడిసిపట్టి.. దానిని సిలిండర్లలో నింపి అవసరాలకు తగ్గట్టు వాడుకునే దిశగానూ ఆలోచనలు చేయాలని ‘వెస్టాస్' సీఈవోకు సూచించారు. ప్రాక్టికల్ గా ఇంకా ఆచరణలోకి రాని ఈ ఐడియాలను ‘మోదీ టర్బైన్ థియరీ' అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో మోదీ.. ‘‘గటర్(మురికి కాలువ) నుంచి గ్యాస్ ఉత్పత్తి చేయొచ్చు..'', ‘‘ఆకాశంలో మేఘాటు దట్టంగా ఉంటే విమానాలు రాడార్ల నుంచి తప్పించుకోవచ్చు..'' అని తప్పుడు థియరీలు చెప్పిన విషయాన్ని కూడా నెటిజన్లు గుర్తుచేశారు. ఈ క్రమంలోనే..
తెలియకపోవడం తప్పు కాదు..
విండ్ టర్బైన్ల నుంచి తాగునీరు, ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయొచ్చంటూ మోదీ ఇచ్చిన సూచనను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘మన ప్రధానికి విషయాలు తెలియకపోవడం తప్పుకాదు. కానీ ఆయన మాట్లాడేది తప్పని పక్కనున్నవాళ్లు చెప్పకపోవడం వల్లే దేశానికి ప్రమాదం'' అని రాహుల్ వ్యాఖ్యానించారు. అయితే, మోదీ టర్బైన్ థియరీలోతప్పేమీ లేదని, అసలు విషయం తెలియనిది రాహుల్ గాంధీకేనని కేంద్ర మంత్రులు ఎదురుదాడికి దిగారు.
సీఈవోనే మోదీని మెచ్చుకున్నారుగా..
‘‘థియరీని అర్థం చేసుకోలేకపోయారని రాహుల్ కు చెప్పే ధైర్యం ఆయన చుట్టూ ఉన్న వారికి లేదు. ప్రధాని సూచనను టాప్ సీఈవోనే అంగీకరించారని రాహుల్ గుర్తించాలి’’ అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పోస్టు పెట్టారు. దాంతోపాటు విండ్ టర్బైన్ల నుంచి నీటిని వేరు చేయొచ్చన్న ఓ వార్తా కథనాన్ని కూడా ఆయన జత చేశారు. ‘‘రాహుల్జీ నేను పంపుతోన్న ఈ సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్లను చదవండి.. బహుశా అర్థమైతే మళ్లీ మాట్లాడండి’’అని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పేర్కొన్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సైతం రాహుల్ పై విమర్శలు గుప్పించారు. మోదీ సూచించిన రెండు ఐడియాల్లో మొదటిది(టర్బైన్ల నుంచి నీటి ఉత్పత్తి) ప్రస్తుతానికి ప్రయోగాల దశలో ఉండగా, రెండోది(ఆక్సిజన్ ఉత్పత్తి) మాత్రం అసహజంగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
Recommended Video
జగన్ అనుంగులు ఆ డ్రగ్స్ వాడతారు - ముగ్గురికి జైలు ఖాయం - 7కొండలు-7రెడ్లు: రఘురామ మరోబాంబు