ప్రధాని రేసులో ఆయన లేరు...సంచలన వ్యాఖ్యలు చేసిన శరద్ పవార్
Recommended Video
ముంబై: 2019 లోక్సభ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది బీజేపీ యేతర కూటమే అని జోస్యం చెప్పారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్ల కంటే ఎక్కువగానే విజయం సాధిస్తుందన్నారు. ఎన్నికల తర్వాతే ప్రధాని ఎవరు ఉంటారన్నదానిపై పార్టీలు చర్చిస్తాయని వెల్లడించారు. అంతేకాదు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని రేసులో లేరని తేల్చి చెప్పారు పవార్. ఆయన కేవలం మోడీ ఓటమిపైనే దృష్టి సారించారని అన్నారు. ప్రధాని అభ్యర్థిగా ఎవరైతే బాగుంటారన్న ప్రశ్నకు గత యూపీఏ హయాంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్ అభ్యర్థిత్వాన్ని అన్ని పార్టీల నేతలు ఆమోదం తెలిపారని పవార్ గుర్తు చేశారు. అయితే ఈ సారి కూడా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడినే ప్రధానిగా ఎన్నుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉంటే ప్రధాని అభ్యర్థి కాంగ్రెస్ నుంచి లేదా మిత్రపక్షాల నుంచి కూడా ఉండే అవకాశం ఉందన్నారు. ఇక బీజేపీ గురించి ప్రస్తావించిన పవార్... అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అంత సంఖ్యా బలం ఉండకపోవచ్చునని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానిగా దేశానికి పనికిరారని బీజేపీ చెప్పే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు పవార్. నిజంగానే రాహుల్ గాంధీ ప్రధానిగా పనికిరాకపోతే బీజేపీ నేతలు తమ ప్రసంగాల్లో పదే పదే రాహుల్ గాంధీని ఎందుకు గుర్తుచేసుకుంటున్నారని పవార్ ప్రశ్నించారు. ఎవరిని చూసి వారికి భయం కలుగుతుందో వారిపై విమర్శలు చేయడమే బీజేపీ పెట్టుకుందని ఆ పార్టీ ఇంకా పాత పద్ధతినే అవలంబిస్తోందని పవర్ అన్నారు.
ప్రాంతీయ పార్టీల బలబలాల పరంగా కూటమి అనేది ఏర్పడుతుందని మహాగట్భంధన్ అనేది బీజేపీ వారు ఇచ్చిన పేరని శరద్ పవార్ చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకపోవడమే మంచిదని తనతో కొందరు బీఎస్పీ నాయకులు చెప్పినట్లు గుర్తు చేశారు. పొత్తుతో కనుక వెళ్లి ఉంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీజేపీకి మళ్లేదని చెప్పారు. ఇక ప్రధానికి ఈ మధ్య కాలంలో వేరే పనే లేనట్టుగా హిందూ జాతీయవాదం, బాలాకోట్ దాడులను మాత్రమే ప్రస్తావిస్తున్నారని విమర్శించారు శరద్ పవార్. భద్రతాబలగాలు మాత్రమే బాలాకోట్పై దాడులు చేశాయని చెప్పిన పవార్... పాక్ బంధీనుంచి విడుదలైన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కూడా జెనేవా కన్వెన్షన్ ప్రకారమే విడుదలయ్యారని అన్నారు. అయితే ఇదంతా తామే చేసుకున్నట్లు మోడీ సర్కార్ చెప్పుకోవడం సరికాదన్నారు. నిజంగానే ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవాలంటే పాకిస్తార్ చెరలో ఉన్న కుల్భూషణ్ జాదవ్ సంగతేంటని ప్రశ్నించారు. ఆయన ఎందుకు విడుదల కావడం లేదని పవార్ సూటిగా అడిగారు.