తమిళనాడులో ఆరెస్సెస్, మోడీ ప్రభుత్వం వల్లే: తుత్తుకూడి ఘటనపై రాహుల్ గాంధీ
తుత్తుకూడి: తమిళనాడు తుత్తుకూడి ఘటనపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం స్పందించారు. తమిళ ప్రజలు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ విధానాలను, ఆదర్శాలను నిరాకరించినందునే హత్యచేయబడ్డారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తుత్తుకూడి ఘటనను ఆయన మోడీ ప్రభుత్వానికి, ఆరెస్సెస్కు లంకె పెట్టారు.
ఈ మేరకు రాహుల్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. ఆరెస్సెస్ విధానాలను నిరాకరించినందుకు చంపేశారని పేర్కొన్నారు. ఆరెస్సెస్, మోడీ తమిళుల ఎమోషన్స్ను అడ్డుకోలేరన్నారు. తమిళ సోదర, సోదరీమణుల వెంట మేం ఉన్నామని చెప్పారు.
అంతకుముందు రోజు కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఉగ్రవాదానికి క్రూరమైన తార్కాణమిది అని, అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తిన ప్రజలను హత్య చేశారని, అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తానని పేర్కొన్నారు. తుత్తుకూడిలో ప్రజలపై పోలీసుల కాల్పులు జలియన్ వాలాబాగ్ను తలపిస్తోందని డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది.
తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ స్మెల్టర్ ప్లాంటు ఘటనపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. తమిళనాడు సర్కారుపై నిప్పులు చెరిగారు. నిరసనకు దిగిన ప్రజలను చంపడమన్నది ముందు చూపులేని, వెన్నెముక లేని తమిళనాడు సర్కారు చర్య అన్నారు. మీరు ప్రజల మొరను ఆలకించలేరని, కాలుష్యానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న ప్రజల ఆవేదనను మీరు అర్థం చేసుకోలేరని, అధికారంలో కొనసాగేందుకు కేంద్రం పల్లవికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారా అని ప్రశ్నించారు.
తూత్తుకుడిలో స్టెరిలైట్ వ్యతిరేక ఆందోళనల సెగ స్టాక్ మార్కెట్ను తాకింది. మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభంలో వేదాంత గ్రూప్ షేర్లు నష్టాలతో కుంగాయి. దీనికి తోడు మద్రాస్ హైకోర్టు ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో షేర్ ధర మరింత కుంగింది. ఉదయం 10.14 గంటలకు రూ.9.35 నష్టంతో రూ.260 వద్ద ట్రేడ్ అవుతోంది.
మరోవైపు, తుత్తుకూడిలో బుధవారం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్నా నగర్ ఏరియాలో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని తెలుస్తోంది.